ఉద్యమ పార్టీగా మొదలై తెలంగాణాలో అధికార పార్టీగా మారిన టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.ఈ మేరకు జాతీయ రాజకీయాల్లో టీఆరెఎస్ కు మంచి గుర్తింపు తెచ్చేందుకు అధినేత కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడు.
ఈ మేరకు తమకు అనువుగా ఉండే రాష్ట్రాల్లో బలం నిరూపించేకునేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.గతంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన కేసీఆర్ అది కాస్తా బెడిసి కొట్టడంతో సైలెంట్ గా ఉండిపోయారు.
తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న టీఆర్ఎస్ పార్టీ వాటి నుంచి త్వరగానే తేరుకున్నట్టు కనిపిస్తోంది.అందుకే ఇకపై మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే టీఆర్ఎస్ పార్టీని ఇప్పటికిప్పుడు ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయించాలనే ఆలోచన కేసీఆర్ కు లేదు.మహారాష్ట్రకు చెందిన కొంత మంది నాయకుల విజ్ఞప్తి మేరకు అక్కడ పార్టీ తరఫున పోటీ చేయడానికి కేసీఆర్ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ మేరకు పార్టీలోని కొంతమంది కీలక నాయకులతో కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం.
ముఖ్యంగా తెలంగాణ సరిహద్దులో ఉండే ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగా నాందేడ్ జిల్లాకు చెందిన దెగ్లూర్, నాయిగాం, భోకర్, హిమాయత్ నగర్, కిన్ వట్ నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం కేసీఆర్ను కలిశారు.అందుకు సీఎం కేసీఆర్ కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఇక బళ్లారితో పాటు ఏపీలో కూడా వచ్చే మున్సిపల్ ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ పార్టీ తరపున అక్కడ కూడా బీఫాంలు ఇచ్చి జాతీయపార్టీ గా గుర్తింపు పొందాలని కేసీఆర్ భావిస్తున్నారట.గత కొద్ది రోజులుగా జాతీయ పార్టీగా అవతరించడానికి టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుందని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా మంది నేతలు టీఆర్ఎస్ నుంచి పోటి చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ బీఫాం ఇస్తే భవిష్యత్తులో ఏపీ, కర్ణాటకలో సైతం టీఆర్ఎస్ బిఫాంలు ఇచ్చే అవకాశముంది.మహారాష్ట్ర ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిని విన్న కేసీఆర్ దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.అయితే దీనిపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతం తెలంగాణాలో పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది.అదీ కాకుండా కేంద్ర అధికార పార్టీ బీజేపీ తెలంగాణాలో పాగా వేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ, టీఆర్ఎస్ లోని కీలకమైన నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇక్కడ పరిస్థితులపై ద్రుష్టి పెట్టకుండా పక్క రాష్ట్రాల్లో పోటీ మీద ఆసక్తి చూపించడం ఏంటంటూ కొంతమంది నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.