ఈటెలను భర్తరఫ్ చేసిన తరువాత కెసీఆర్ ఎటువంటి వ్యూహంతో అయితే అంచనా వేశాడో ఆ వ్యూహం అనేది విఫలమైనదనేది స్పష్టంగా అర్థమవుతోంది.అంతేకాక ఈటెలను ఒంటరిని చేసి దామోదర్ రెడ్డి తరహాలో రాజకీయ భవిష్యత్తు నాశనం చేద్దామని అనుకున్న కెసీఆర్ కు బీజేపీ రూపంలో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు.
అయితే ఇప్పడు ఈటెలకు ప్రజల నుండి మద్దతు పెరగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి ఏర్పడింది.ఇక ప్రజలలో ఏర్పడ్డ సానుభూతిని రూపు మాపాలంటే టీఆర్ఎస్ చాలా శ్రమించాల్సి ఉంటుంది.
అయితే ఈటెల విషయంలో హుజూరాబాద్ లో ఈటెలకు ధీటైన నేత లేకపోవడం టీఆర్ఎస్ కు మైనస్ గా మారింది.ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో పాగా వేసిన కెప్టెన్ లక్ష్మీ కాంతారావు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లతో కలిసి వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి ఉంది.
క్షేత్ర స్థాయిలో అంతా సిద్దమయ్యాక టీఆర్ఎస్ నుండి అధికారిక ప్రచారం ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్న పరిస్థితి ఉండడంతో ఒక్కసారిగా ప్రజల దృష్టి టీఆర్ఎస్ వైపు మళ్లించి టీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చుకోవాలన్నది టీఆర్ఎస్ ప్రధాన వ్యూహంలా కనిపిస్తోంది .మరి ఈటెలను టీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందనేది చూడాల్సి ఉంది.