ఎప్పటి నుంచో భర్తీ చేస్తారని అంతా భావిస్తూ వస్తున్న టిఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవులను ఎట్టకేలకు ఆ పార్టీ అధినేత కెసిఆర్ భర్తీ చేశారు.తెలంగాణలో ఏర్పడిన కొత్త జిల్లాలు , పాత జిల్లాలు అన్ని చోట్ల ఈ పదవులు భర్తీ చేపట్టారు.
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత అసలు జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తారా లేదా అనే సందేహం అందరినీ వెంటాడింది.అయితే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కెసిఆర్ ఈ పదవుల భర్తీ వ్యవహారంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు.
ఈ జిల్లా అధ్యక్ష పదవుల్లో చాలామంది ఎమ్మెల్యేలకు , జడ్పీ చైర్మన్ లకు ఇలా చాలా మందికి అవకాశం దక్కింది.కానీ మంత్రులు ఎవరికి జిల్లా అధ్యక్ష పదవులు దక్కలేదు.
దీంతో ప్రస్తుతం పదవులు పొందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం లేదు అనే ప్రచారం తెరపైకి వచ్చింది.
ఎప్పటి నుంచో టిఆర్ఎస్ మంత్రి వర్గ విస్తరణపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కవిత ను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని కెసిఆర్ ప్రక్షాళన చేస్తారని, అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కొత్త మంత్రివర్గంలో తమకు తప్పకుండా అవకాశం దక్కుతుందని చాలా మంది ఆశలు పెట్టుకున్నారు.
వీరిలో బాల్క సుమన్, జోగు రామన్న, ఆరూరి రమేష్, దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు, మాజీ మంత్రులు జోగు రామన్న లక్ష్మారెడ్డి లు ఉన్నారు.అయితే వీరు అందరినీ జిల్లా అధ్యక్షులు గా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియమించారు.
దీంతో తమకు మంత్రి పదవులు దక్కే అవకాశం లేదు అనే ఆందోళనలో ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు పొందిన నాయకులు ఉన్నారు.తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్న కెసిఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం లేదనే ప్రచారం మరోవైపు జరుగుతోంది.కానీ కొత్తగా జిల్లా అధ్యక్ష పదవులు పొందిన ఎమ్మెల్యేల్లో మాత్రం మంత్రి వర్గ విస్తరణపై అనేక సందేహాలు నెలకొన్నాయి.తమను మంత్రివర్గ రేసు నుంచి తప్పించేందుకు కేసీఆర్ జిల్లా అధ్యక్ష పదవులు కట్టబెట్టారా అనే అనుమానం వీరిలో నెలకొందట.