బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాదులో ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తుంది.ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు , కీలక నాయకులు హాజరు కాబోతుండడంతో ఆ స్థాయిలో ఏర్పాట్లను చేపట్టారు.
ఇప్పటికే పదిలక్షల ఆహ్వానాలను అందించారు.భారీ స్థాయిలో జన సమీకరణ చేపట్టి తెలంగాణలో బిజెపి సత్తా చాటాలనే పట్టుదలతో ఆ పార్టీ నాయకులు ఉన్నారు.
ఈ సమావేశాల్లోనే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ఇరుకుని పెట్టే విధంగా బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి వారు తమ ప్రసంగాల్లో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో టిఆర్ఎస్ అలర్ట్ అయింది.
ఈ సభల నుంచి ప్రజల దృష్టి మరలచేందుకు, మీడియా ఫోకస్ తగ్గించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఈ మేరకు బిజెపి సభలకు పోటీగా టిఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించుకుంది.
అలాగే ఇప్పటి వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేసింది.అలాగే నియోజకవర్గాల్లోనూ ” చాలు మోడీ … సంపకు మోడీ, బైబై మోడీ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.
అలాగే ఇప్పటికే బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు చెందిన వ్యవహారాన్ని అనూహ్యంగా టిఆర్ఎస్ తెరపైకి తెచ్చింది.రాజేందర్ భూములను కబ్జా చేశాడని, 85 ఎకరాలకు భూమిని పంచేందుకు బుధవారం పట్టాలను కూడా అధికారులు ఇచ్చారు.దీనిపై ఈటెల రాజేందర్ ఘాటుగానే స్పందించడంతో టిఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆయనకు కౌంటర్ ఇచ్చారు.శుక్రవారం హేచరీస్ వద్దకు వస్తామని దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
ఈ వ్యవహారం మీడియాలోనూ ఫోకస్ అవుతోంది.అలాగే ఈనెల రెండవ తేదీన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు రాబోతూ ఉండడం తో మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
అలాగే నేటి నుంచి మూడో తేదీ వరకు జాతీయ మీడియాతో పాటు, రాష్ట్ర పత్రికల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి పెద్ద ఎత్తున యాడ్ లను బుక్ చేసుకుంది.ఇలా అనేక వ్యూహాలను అమలు చేస్తూ బిజెపి సభలకు ఫోకస్ తగ్గేలా ప్రయత్నాలు చేస్తోంది.