ఎప్పుడూ లేనంత స్థాయిలో రాజకీయ వ్యతిరేకత ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఎదుర్కొంటున్నారు.మునుపెన్నడూ లేనంత స్థాయిలో ప్రజా వ్యతిరేకతను చవిచూస్తున్నారు.
కొత్త కొత్తగా రాజకీయ శత్రువులు తయారవడం, తన రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం చేసే స్థాయిలో వారు బలపడుతుండడం వంటి వ్యవహారాలు టిఆర్ఎస్ కు ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.అయినా కేసిఆర్ మాత్రం ఆ ఇబ్బందులన్నీ సర్వసాధారణమైనవేయనని, పెద్దగా పట్టించుకోనట్టు గానే వ్యవహరిస్తుండడం, రాజకీయ శత్రువుల మరింతగా బలపడేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా చెప్పుకుంటే , రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా వ్యతిరేకత మరింత ఎక్కువ అయ్యింది.
ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కూడా పార్టీలో ఈ విషయంపైన చర్చ జరుగుతోంది అంటే, టిఆర్ఎస్ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా యువతలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.తాము అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించి , నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని గొప్పగా హామీలు ఇవ్వడం, ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ విషయంలోనూ ఇదే రకమైన పరిస్థితి ఎదుర్కోవడం, కొత్త కొత్త చట్టాలు , కొత్త కొత్త పన్నుల వడ్డింపు, వంటివి ప్రజల్లో టీఆర్ఎస్ పలుకుబడిని బాగా తగ్గించి వేస్తున్నాయి.
దీనికి తోడు మంత్రులు, ఎమ్మెల్యే లు, ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటూ వస్తుండడంతో పాటు, ఇంటలిజెన్స్ నివేదికలు బాగా భయపెడుతున్నాయి.మరోవైపు చూస్తే సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తోంది.ఇంకో వైపు అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ వంటి పార్టీలు దూసుకువస్తున్నాయి.ఇవన్నీ మామూలే అయినా ఇప్పుడు సొంత పార్టీలోనూ అసమ్మతి పెరిగిపోతుండటం, ఈటెల రాజేందర్ వంటి వారు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం అవుతుండడం , కేసీఆర్ రాబోయే ఎన్నికల నాటికి కేసీఆర్ యాక్టివ్ గా ఉంటారా లేక ఫార్మ్ హౌస్ కి పరిమితం అయిపోతారా అనేవి కూడా చర్చకు వస్తున్నాయి.
ఎలా చూసుకున్నా మూడోసారి అధికారం దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు అనే సంగతి కేసీఆర్ కు బాగా అర్థం అయిపోయింది.