తెలంగాణాలో ఉప్పు నిప్పులా మారిన బీజేపీ టీఆర్ఎస్ మధ్య రోజు రోజుకి మాటల యుద్ధం ముదిరిపోతోంది.ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.
తెలంగాణాలో బలపడాలని చూస్తున్న బీజేపీ తమకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న టీఆర్ఎస్ ను నిలువరించేందుకు ప్రయత్నిస్తోంది.ఇక ఇదే సమయంలో టీఆర్ఎస్ కూడా బీజేపీ దూకుడుకు బ్రేక్ వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.
తాజాగా ఈ రెండు పార్టీల మధ్య సభ్యత్వ నమోదుకు సంబంధించి ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది.మీ పార్టీవి బోగస్ సభ్యత్వాలు అంటూ ఇరు పార్టీలు వాదనలకు దిగుతున్నాయి.
ఈ వాదనలు ఇలా ఉండగానే టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు సంబంధించి విజయోత్సవ సభ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతుండడం బీజేపీకి మరింత అసహనాన్ని కలిగిస్తోంది.
రెండేళ్లపాటు అమల్లో ఉండే పార్టీ సభ్యత్వాల సేకరణ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఈ ఏడాది జూన్ 27న ప్రారంభించారు.కోటి మందిని పార్టీ సభ్యులుగా చేర్చాలని లక్ష్యం నిర్దేశించుకోగా సుమారు నెలన్నర వ్యవధిలో 60 లక్షల మందికి టీఆర్ఎస్ సభ్యత్వం ఇచ్చారు.ఇందులో 20 లక్షల మంది క్రియాశీల సభ్యులని ప్రకటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ్యత్వ నమోదు ద్వారా పార్టీ ఖాతాకు రూ.25 కోట్ల మేర నిధులు సమకూరే అవకాశం ఉందని వెల్లడించారు.ఈ నెల 31 వరకు పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ సన్నాహాలు మొదలుపెట్టింది.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 50 వేల సభ్యత్వాల ద్వారా దేశంలోనే ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీగా టీఆర్ఎస్ నిలిచిందని కేటీఆర్ ప్రకటించారు.అయితే కేసీఆర్ చెబుతున్న లెక్కలన్నీ బోగస్ అని బీజేపీ వాదిస్తోంది.
బీజేపీ కూడా జూలై 6న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా తెలంగాణ కు వచ్చి ఇక్కడే సభ్యత్వ నమోదు చేయించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ హోరాహోరీగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం చివరి దశకు వచ్చిన సమయంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగిపోయింది.టీఆర్ఎస్వి బోగస్ సభ్యత్వాలు అని, పార్టీ నేతలే జాబితాలు తయారు చేశారని బీజేపీ విమర్శించింది.
అయితే బీజేపీ ‘మిస్డ్కాల్’ద్వారా చేసిన సభ్యత్వాలను కూడా కలుపుకొని పార్టీ సభ్యుల సంఖ్య 13 లక్షలు అని చెప్పుకుంటోందని టీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది.బీజేపీ చేసినట్టు మిస్డ్ కాల్ సభ్యతాలు చేస్తే తాము కూడా కోట్లలో సభ్యత్వాలు చేయగలమంటూ టీఆర్ఎస్ ఎద్దేవా చేస్తోంది.