విలక్షణ నటుడుగా సౌత్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ఉపేంద్ర.కన్నడ సూపర్ స్టార్ గా ఉన్న ఉపేంద్ర, దర్శకుడుగా కెరియర్ ఆరంభించి తరువాత నటుడుగా మారాడు.
రెగ్యులర్ కి భిన్నంగా ఇంటరెస్టింగ్ పాయింట్స్ తో కథలు సిద్ధం చేసుకొని సినిమాలు చేసిన ఉపేంద్ర కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకి చేరువ అయ్యాడు.అతని సినిమాలు ఏ, ఉపేంద్ర, రక్త కన్నీరు సినిమాలు టాలీవుడ్ లో కూడా అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
ఈ నేపధ్యంలో ఉపేంద్ర నటించిన సినిమాలు అన్ని తెలుగు ప్రేక్షకులని డబ్బింగ్ రూపంలో పలకరిస్తూనే ఉన్నాయి.అయితే టాస్ అనే సినిమాలో మొదటిసారి స్ట్రైట్ తెలుగు సినిమా చేసిన అది వర్క్ అవుట్ కాలేదు.
మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉపేంద్రని సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కోసం టాలీవుడ్ కి తీసుకొచ్చాడు.ఈ సినిమాలో అల్లు అర్జున్ తో సమానమైన పాత్రని ఉపేంద్రకి మాటల మాంత్రికుడు ఇచ్చాడు.
ఓ విధంగా ఈ సినిమా ఉపేంద్ర ఎంట్రీతో మల్టీ స్టారర్ గా మారిపోయింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాలో కీలక పాత్రలో ఉపేంద్ర కనిపించబోతున్నాడు.
ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తన సినిమా కోసం ఉపేంద్రని ఖరారు చేసినట్లు తెలుస్తుంది.త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాని తారక్ తో ప్లాన్ చేశాడు.ఫ్యామిలీ ఎలిమెంట్స్ మిక్స్ చేసిన పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.ఇక ఈ సినిమాలో తారక్ ఎదుర్కొనే విలనీ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, ఆ పాత్ర కోసం ఉపేంద్రని మాటల మాంత్రికుడు ఖరారు చేశారని తెలుస్తుంది.
సన్నాఫ్ సత్యమూర్తి సక్సెస్ తో ఉపేంద్ర కూడా త్రివిక్రమ్ మీద మంచి నమ్మకంతో ఉండటంతో ఎన్ఠీఆర్ సినిమా గురించి చెప్పగానే అంగీకరించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉపేంద్ర చంద్రు దర్శకత్వంలో కబ్జా అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.