ఇప్పటికే ఏపీలో చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ అదే పరిస్థితిలో ఉండడంతో హై కమాండ్ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది.ఇప్పటివరకు చూసి చూడనట్టు వదిలేశామని ఇక ఇలాగే వదిలేస్తే చేతులు కాలడం ఖాయం అనే నిర్ణయానికి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చూస్తోంది.
అందులో భాగంగానే ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వాన్ని మార్చాలని చూస్తోంది.మొన్న తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకోవాలని టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నిటితో పొత్తు పెట్టుకుంది.
అయినా ఆశించిన లాభం అయితే ఆ పార్టీకి కలగకపోగా మరింత బలహీనపడినట్టు అర్ధం అయ్యింది.
ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది.
ఇక జరగాల్సిందే మిగిలి ఉంది అన్న ధోరణిలో వచ్చే ఎన్నికల నాటికి పుంజుకునేందుకు ఇప్పటి నుంచే పార్టీని ప్రక్షాళన చేసేపనిలో పడింది.తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే టి.కాంగ్రెస్ లో కీలక మార్పులు తప్పవనీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మొదలుకొని కీలక పదవులు అన్నిటిలో కొత్తవారికి బాదయతలు అప్పగించాలని చూస్తోంది.కాకపోతే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి విషయమై ప్రస్తుతం రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఆయన మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే.లోక్ సభ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపుకోసం ఆయన ఒక్కరే బాగా కష్టపడ్డారనీ, ఇతర నేతలు పోటీలో ఉన్నా అంతగా కష్టపడలేదని హై కమాండ్ కు సమాచారం అందింది.
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయాలంటే రేవంత్ చేతిలోనే పార్టీని పెట్టాలని అధిష్టానం చూస్తోందట.అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన జీవన్ రెడ్డికి కూడా పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
టీఆర్ఎస్ ను ఎదుర్కోవడంలో ఆయన కూడా కీలకంగా వ్యవహరిస్తారని కాంగ్రెస్ ఇప్పటికే గుర్తించింది.ఎన్నికల్లో ప్రచార కమిటీ బాధ్యతలు నిర్వహించిన విజయశాంతికి కూడా కీలక పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్టు కాంగ్రెస్ లో చర్చ నడుస్తోంది.
వీరందరికి కీలక బాధ్యతలు అప్పగించి ప్రస్తుతం ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాలను తప్పించాలని అధిష్టానం చూస్తోంది.గట్టి టాకింగ్ పవర్ ఉన్నవాళ్లు అయితే పార్టీకి ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా మంచి మైలేజ్ తీసుకొస్తారని అధిష్టానం భావిస్తోంది.