పూర్వం బడికి వెళ్లాలంటే కిలో మీటర్లు కిలో మీటర్లు నడవాల్సిన పరిస్థితి ఉండేది.ఈ విషయాన్ని మన పెద్దలు ఎక్కువగా చెబుతూ ఉండేవారు.
అయితే ఇప్పుడు కాలం మారింది.ప్రతి చోటకి వెళ్లేందుకు విశాలమైన రహదార్లు, రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి.
మారు మూల ప్రదేశాల్లో కూడా ఆధునిక సౌకర్యాలు అందరికి అందుబాటులోకి వచ్చాయి.అయినా కొన్ని కొన్ని గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోతున్నాయి.
ఆయా గ్రామాల్లో బడికి వెళ్లాలంటే చిన్నారులు నానా యాతన పడాల్సిందే.సరైన రవాణా మార్గాలు కూడా లేకపోవడమే దీనికి కారణం.
కర్నూలు జిల్లా కౌతాళం మండల పరిధిలోని కాత్రికి, లింగాలదిన్నె, అగసలదిన్నె, దొమ్మెలదిన్నె, వీరాలదిన్నె గ్రామాల విద్యార్థులు ఉన్నత చదువుల కోసం నిత్యం కౌతాళం రావాల్సి ఉంటుంది.పాఠశాలలో చదువుకునేందుకు కొంతమంది విద్యార్థులు సైకిళ్లపై, అందుబాటులో ఉన్న వాహనాలపై వస్తుంటారు.
అదే విధంగా కొంతమంది విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు జేసీబీలో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ వెళ్లడం అక్కడి పరిస్థితి అర్ధం పడుతోంది.
ఇది వారికి నిత్యకృత్యంగానే మారింది.
నిత్యం పాఠశాలకు వెళ్లేందుకు వారంతా కాలినడకన ఆరు కిలోమీటర్లు నడిచి బాపురం చేరుకుంటారు.అనంతరం అక్కడి నుంచి బస్సులు ఎక్కి కౌతాళం ఉన్నత పాఠశాలకు వస్తారు.
పాఠశాల వేళల్లో బస్సులు రాకపోవడంతో రోడ్డుపై నిరీక్షించే సమయంలో అటుగా వచ్చే వాహనాలను అపి ఎక్కుతూ ఉంటారు.ఆ విధంగానే విద్యార్థులంతా ఇలా జేసీబీ లో ప్రమాదకరంగా వెళ్లడం వార్తల్లోకి ఎక్కేలా చేసింది.