అగ్ర రాజ్యం అమెరికా ప్రపంచాన్ని శాసించే పెద్దన్నగా వ్యవహరిస్తూ, పక్క దేశాల మధ్య సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తుంది కానీ తమ దేశంలో ప్రజాస్వామానికి అతి పెద్ద సమస్యగా మారిన గన్ కల్చర్ పై మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి పరిష్కార మార్గం చూపలేక పోతోంది.దేశంలో రోజు రోజుకు తుపాకి మరణాలు సంభవిస్తున్నా, చిన్నారు ఎంతో మంది తూటాలకు బలై పోతున్నా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా పెద్దన్న ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమెరికా ప్రజలను ఆందోళనలోకి నెడుతోంది.
గతంలో అమెరికాలోని ఓ స్కూల్ లో జరిగిన తుపాకి కాల్పులలో సుమారు 19 మంది చిన్నారులు బలై పోయిన క్రమంలో హడావిడిగా అప్పటికప్పుడు చట్టాలు తీసుకొస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం వైఫల్యం చెందిందనే చెప్పాలి.తాజాగా అమెరికాలో పిల్లలపై జరిగిన మరో కాల్పుల ఘటన మరో సారి విషాదాన్ని నింపింది.
అమెరికాలోని మేరీ ల్యాండ్ లో ఓ ఇంటిలో జరిగిన కాల్పుల ఘటనలో 3 చిన్నారులు తూటాలకు బలై పోయారు.వీరితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
మృతి చెందిన చిన్నారులు అందరూ 5 నుంచీ 8 వ తరగతి చదువుకుంటున్న వారిగా పోలీసులు వెల్లడించారు.దుండగుడు ఇంట్లో కాల్పులు జరుపుతున్న సమయంలో శబ్దం విన్న వ్యక్తి పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన వచ్చిన పోలీసులు మృతులను ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను సేకరించిన అధికారులు సిసి టీవీ పుటేజ్ ను కూడా సేకరించినట్టుగా తెలుస్తోంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని విచారణ మొదలు పెట్టామని మీడియాకు పోలీసులు తెలిపారు.
కాగా అదే రోజున అమెరికాలో మరో కాల్పుల ఘటన చోటు చేసుకుందని ఓ నల్ల జాతి యువకుడు జరిపిన కాల్పులలో సుమారు నలుగురు మృతి చెందారని తెలుస్తోంది.