దేశంలోని ప్రజల్లో చాలామంది నిబంధనలు తెలిసినా పాటించడానికి ఇష్టపడరు.పక్కవాళ్లు రూల్స్ చెబితే నిబంధనలు పాటించకపోతే ఏమవుతుంది.? అంటూ ఎదురు ప్రశ్నిస్తూ ఉంటారు.కొందరు నిబంధనలు పాటించక పోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
హైదరాబాద్ మహానగరంలో చాలామంది సెల్లార్ లోని నీటిని రోడ్లపైకి వదులుతున్నారు.
ఇలా చేయడం వల్ల ద్విచక్రవాహనాలపై ప్రయాణించే ప్రయాణికులు జారిపడి దెబ్బలు తగిలించుకుంటున్నారు.
పలువురు వాహనదారులు సోషల్ మీడియాలో వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలను షేర్ చేయడంతో పాటు అధికారులకు ఫిర్యాదులు చేశారు.దీంతో అధికారులు రోడ్లపైకి నీళ్లను వదిలే వారి విషయంలో కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమయ్యారు.
తాజాగా సెల్లార్ లోని నీటిని మోటార్ సర్వీస్ ద్వారా రోడ్డుపైకి వదిలినందుకు వాసవీ జీపీ ట్రెండ్స్ బిల్డింగ్ మేనేజ్మెంట్కు అధికారులు లక్ష రూపాయలు జరిమానా విధించారు.
నానక్రామ్ గూడ ORR సర్వీస్ రోడ్ లో ఉన్న వాసవీ జీపీ ట్రెండ్స్ బిల్డింగ్ గతంలో కూడా చాలాసార్లు సెల్లార్ లోని నీటిని రోడ్డుపైకి వదిలింది.
ఆ రోడ్డు సర్వీస్ రోడ్డు కావడంతో వాహనదారులు జారి పడి దెబ్బలు తగిలించుకుంటున్నారు.ఫలితంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.గతంలో అధికారులు పలుమార్లు హెచ్చరించినా మేనేజ్మెంట్ పద్దతి మార్చుకోలేదు.
ట్రాఫిక్ ఎస్సై రవి జోనల్ కమిషనర్ కు సమస్య వివరించి వాసవీ జీపీ ట్రెండ్స్ బిల్డింగ్ కు లక్ష రూపాయలు జరిమానా విధించినట్లు మీడియాకు తెలిపారు.
భారీగా ఫైన్ విధించడంతో నగరంలో రోడ్లపైకి నీళ్లు వదలాలంటే ప్రజలు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని చెబుతున్నారు.నిబంధనలు పాటించని వారికి భారీ మొత్తంలో జరిమానా విధించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల వాహనదారులకు ఇబ్బందులు తప్పుతాయని.భవిష్యత్తులో రోడ్లపై నీళ్లను వదిలితే జరిమానా విధిస్తారనే భయం ఉంటుందని చెబుతున్నారు.