అమెరికాలో స్థిరపడిన కొన్ని లక్షల మందికి తమ పూర్వీకులు ఇక్కడికి ఎలా వచ్చారోనని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుంది.అలాగే కొన్ని పత్రాలు వారికి ప్రభుత్వ సంబంధిత విషయాల్లో ఏదో రకంగా ఉపయోగపడతాయి.
దీనిలో భాగంగా యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) 100 ఏళ్లనాటి కొన్ని విలువైన పత్రాలను భద్రపరచింది.కొంత రుసుము చెల్లించి పౌరులు వీటిని పరిశీలించవచ్చు.
అయితే ఇకపై ఇలాంటి సేవలపై రుసుమును పెంచాలని యూఎస్సీఐఎస్ నిర్ణయించింది.ఇందుకు సంబంధించి ప్రజలు తమ అభ్యంతరాలు, సలహాలను ఇవ్వాల్సిందిగా ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసింది.కొత్త ప్రతిపాదనల ప్రకారం ఇమ్మిగ్రేషన్ ఫైళ్లను పొందడానికి చెల్లించే రుసుమును 500 శాతం పెంచాలని యూఎస్సీఐఎస్ భావిస్తోంది.అంటే ఈ పత్రాల కోసం 600 డాలర్ల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఏజెన్సీ నిర్ణయం వల్ల 18వ శతాబ్ధం చివరిలో, 19వ శతాబ్ధం ఆరంభంలో అమెరికాకు వలస వచ్చిన కొన్ని మిలియన్ల కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.వారి కుటుంబ చరిత్రలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ఈ ఫైల్స్, ఫోటోలు విలువైన సమాచారాన్ని అందిస్తాయి.అలాగే వారి పూర్వీకులు ఎలా జీవించారో అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడతాయని పలువురు చెబుతున్నారు.ఈ పత్రాలు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వరకు అమెరికా పౌరసత్వం నిరాకరించబడిన జపనీయులు, అలాగే 1870-1950ల మధ్య వలస వచ్చిన చైనీయులకు అత్యంత అవశ్యకం.
ప్రస్తుతం ఆయా పత్రాల యూఎస్సీఐఎస్ వద్ద నుంచి పొందేందుకు 65 డాలర్లు చెల్లించాలి.