ఓ వైపు కరోనా వైరస్తో చస్తుంటే.అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి కన్నెర్ర చేసింది.
గత కొన్ని రోజులుగా దేశంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.వేడిగాలుల ధాటికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు.
మరోవైపు అడవుల్లో కార్చిచ్చులు రేగి లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు.
ముఖ్యంగా కాలిఫోర్నియాలో అడవుల్లో రగిలిన కార్చిచ్చు అంతకంతకూ దావానలంలా విస్తరిస్తోంది.
తాజాగా ఉత్తర కాలిఫోర్నియాలోని మౌంటెన్ పట్టణాన్ని కార్చిచ్చు చుట్టుముట్టడంతో వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.ఇప్పటికే మంటల్లో చిక్కుకుని పలు ఇళ్లు దగ్ధం కాగా, లక్షలాది హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది.
మరోవైపు మంటలు మరింత విస్తరించకుండా ఉండేందుకు అగ్నిమాపక సిబ్బంది, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.అయితే గంటకు 64 కి.మీ వేగంతో గాలులు వీస్తుండటంతో వీరి ప్రయత్నాలకు ఆటంకం ఎదురవుతోంది.గ్రీన్విల్లేలోని సియెర్రా నెవాడా పట్టణం కార్చిచ్చు వల్ల తీవ్రంగా నష్టపోయింది.
ఈ ప్రాంతంలోని చర్చి, గ్యాస్ స్టేషన్, హోటల్, మ్యూజియం, బార్లు సహా ఇళ్లు కార్చిచ్చు ధాటికి దగ్ధమయ్యాయి.దీంతో గ్రీన్విల్లే పరిసర ప్రాంత ప్రజలను తమ నివాసాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు.
మంటలు ఆల్మనూరు సరస్సు వరకూ విస్తరించడతో సరస్సుకు తూర్పు ప్రాంతంలో ఉంటున్న 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.మంటల ధాటికి ఆకాశంలో 30 వేల అడుగుల ఎత్తు వరకూ నల్లటి పొగ ఆవరించినట్టు అధికారులు వెల్లడించారు.జులై 14న ప్రారంభమైన ఈ కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తూ ఇప్పటి వరకూ 67 ఇళ్లను దగ్ధం చేసింది.ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో.7,560 చ.కి.మీ మేర ఈ కార్చిచ్చు వ్యాపించిందని యూఎస్ నేషషనల్ ఇంటర్ఏజెన్సీ ఫైర్ సెంటర్ వెల్లడించింది.
ఇక ప్లుమాస్ కౌంటీలో శరవేగంగా వ్యాప్తిస్తున్న మంటల ధాటికి భారీగా భవనాలు, వాహనాలు కాలి బూడిదయ్యాయి.ఫ్లుమాస్తో పాటు టైలర్స్విల్లే కౌంటీ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కొన్ని చదరపు కిలోమీటర్ల మేర దావానలం వ్యాపించింది.సుమారు 20 వేల మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కాలిఫోర్నియా చరిత్రలోనే ఇది మూడో అతిపెద్ద దావానలం అని అధికారులు చెబుతున్నారు.