కరోనా వ్యాక్సిన్ వెలుగులోకి వచ్చాక భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి అర్ధమవుతోంది.మనదేశంలో వ్యాక్సినేషన్ను వేగంగా నిర్వహించడంతో పాటు వివిధ దేశాలకు ఇండియా టీకాలను ఎగుమతి చేసింది.
తద్వారా కరోనా ద్వారా సంభవించే మరణాలను అడ్డుకోవడంలో మనదేశం కీలక పాత్ర పోషించింది.ఈ నేపథ్యంలో భారతదేశంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
తాజాగా అమెరికా శాస్త్రవేత్త, బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ డీన్ డాక్టర్ పీటర్ హోటెజ్ ఆ లిస్ట్లో చేరారు.కోవిడ్ను ఎదుర్కోవడంలో భారత్ చేస్తున్న కృషిని తక్కువగా చూడొద్దని ఆయన సూచించారు.
‘కొవిడ్ వ్యాక్సినేషన్-సాధారణ స్థితులు’ అనే అంశంపై ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీజీహెచ్) ఏర్పాటు చేసిన ఓ వెబినార్లో పీటర్ పాల్గొన్నారు.
వైద్యశాస్త్రంలో ఉన్న అపారమైన అనుభవంతో భారత్ ఫార్మసీ దేశంగా వెలుగొందుతోందన్నారు.
అంతేకాకుండా ఔషధ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న దేశం నుంచి కొవిడ్ టీకాను తీసుకెళ్లేందుకు ప్రపంచ దేశాలు క్యూ కడుతున్నాయని హోటెజ్ చెప్పారు.ఎంఆర్ఎన్ఏ సాంకేతికతో అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవి ప్రభావం చూపలేకపోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కానీ, ఇండియా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను అంతర్జాతీయ సంస్థల ఒప్పందాలతో పేద దేశాలకు అందిస్తూ భారత్ ప్రపంచాన్ని రక్షిస్తోందని హోటెజ్ ప్రశంసించారు.వైరస్పై పోరాటంలో వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చి భారత్ ప్రపంచానికి పెద్ద బహుమతే ఇచ్చిందని కొనియాడారు.
కాగా, వ్యాక్సిన్ల ప్రభావం సమయంపై స్పష్టత లేనందున మ్యూటేషన్లను ఎదుర్కొనేందుకు బూస్టర్ డోసులు అవసరం ఉందని పీటర్ హోటెజ్ అభిప్రాయపడ్డారు.
కాగా పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్, ఆస్ట్రాజెనికాలు కోవిషీల్డ్ను అభివృద్ధి చేయగా, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ను తయారు చేసింది.ఈ రెండింటిని అత్యవసర వినియోగానికి అనుమతిస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.దీంతో జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
తొలి దశలో ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్కు టీకాలు వేయగా, మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు.అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కలిగి.45 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు వేస్తున్నారు.ఇక కొవాగ్జిన్, కోవిషీల్డ్లను బ్రెజిల్, కెనడా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవులు సహా ఇతర మధ్యాసియా, ఆఫ్రికా దేశాలకు భారత్ ఎగుమతి చేసింది.
రాబోయే రోజుల్లో ఈ లిస్ట్ మరింత పెరిగే అవకాశం వుందని అంచనా.