తిరుపతి లోక్ సభ స్థానం పై బీజేపీ గట్టిగానే ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభను పోటీకి దించిన బీజేపీ ఆమె ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రిని చేస్తామని, ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటాం అంటూ ఎన్నెన్నో చెబుతున్నారు.
అయితే ఇక్కడ గెలవడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదని, బీజేపీ అగ్రనేతలు కు బాగా తెలుసు.ఎందుకంటే ఇక్కడ వైసీపీ బలంగా ఉండడం, ఏపీలో ఆ పార్టీ అధికారంలో ఉండడం, తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ బలంగా ఉండడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతూ, వైసీపీ పాలన పై జనాల్లో సానుకూలత ఎక్కువగా ఉండడం ఇవన్నీ బిజెపిని కలవరానికి గురిచేస్తున్నాయి.
అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా బిజేపి ప్రకటించి, ఆ పార్టీ మద్దతుదారులను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది.
తిరుపతి లోక్ సభ పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు బీజేపీ జాతీయ స్థాయి నాయకులు పెద్ద ఎత్తున వచ్చేందుకు షెడ్యూల్ రెడీ చేసుకున్నారట.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో పాటు, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, మూడు నాలుగు రోజుల వ్యవధిలో తిరుపతికి రాబోతున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, యోగి ఆదిత్యనాథ్ తో పాటు, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప సైతం రత్నప్రభ ను గెలిపించేందుకు, తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
అలాగే బిజెపి అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఎన్నికల ప్రచారానికి వస్తున్నారట.
అలాగే బీజేపీ లో ఉన్న సినీ రంగానికి చెందిన ప్రముఖులను ప్రచారంలోకి దింపబోతున్నారట.ఇలా ఏదో రకంగా వైసీపీని బలంగా ఢీ కొట్టి తిరుపతి స్థానాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ అగ్ర నాయకత్వం ఉండడంతో, ఇక్కడ పోటీ హోరాహోరీగా ఉండేలా కనిపిస్తోంది.టిడిపి నుంచి పనబాక లక్ష్మిని రంగంలోకి దింపినా, వైసిపి బీజేపీ మధ్య పోటీ హోరా హోరీ గా ఉండేలా కనిపిస్తోంది.