గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే.వర్షాలు, వరదల వల్ల పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోగా వందల సంఖ్యలో ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి వరదల వల్ల వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.తమిళనాడు, ఢిల్లీ సీఎంలు తెలంగాణకు ఆర్థిక సాయం అందించగా టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం తమ వంతు సహాయం చేయడానికి ముందుకొచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించగా మహేష్ బాబు సైతం అంతే మొత్తం విరాళంగా ప్రకటించారు.స్టార్ హీరో నాగార్జున ట్విట్టర్ వేదికగా 50 లక్షల రూపాయల విరాళం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వబోతున్నట్టు తెలిపారు.
మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు.పెద్ద హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోలు ప్రజలు కష్టాలు పడుతున్న తరుణంలో తమ పెద్ద మనస్సును చాటుకున్నారు.
ఎనర్జిటిక్ హీరో రామ్ 25 లక్షల రూపాయలు, విజయ్ దేవరకొండ 10 లక్షల రూపాయలు, ప్రకటించారు.స్టార్ హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్లు సైతం తాము అండగా ఉంటామంటూ ముందుకొచ్చారు.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షల రూపాయలు, అనిల్ రావిపూడి 5 లక్షల రూపాయలు, హరీష్ శంకర్ 5 లక్షల రూపాయలు ప్రకటించారు.ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారని సమాచారం.
విరాళాలు అందించిన సెలబ్రిటీలందరీకీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు సైతం భారీ మొత్తంలో విరాళాలను ప్రకటిస్తున్నారు.కష్టాల్లో ఉన్న తమను ఆదుకోవడానికి సెలబ్రిటీలు ముందుకు రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ సమయంలో సైతం టాలీవుడ్ సెలబ్రిటీలు తమ వంతు సాయం చేసిన సంగతి తెలిసిందే.