పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు గుమ్మడి కాయ కొట్టేసిన విషయం తెల్సిందే.ఇప్పటికే పవన్ నాలుగు సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు.
ఏ సినిమాను ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాడు అనే విషయమై అందరిలో ఆసక్తి నెలకొంది.ఈ సమయంలో పవన్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ నెలలోనే మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ ను పవన్ పట్టాలెక్కించే అవకాశం ఉందట.
ఇటీవలే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది.ప్రస్తుతం సెట్ మరియు నటీనటులకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నాడు అంటున్నారు.
తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా ను మార్చారనే వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రానా మరియు పవన్ లు చాలా విభిన్నంగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా త్రివిక్రమ్ కథను మార్చాడని కూడా తెలుస్తోంది.
మలయాళంలో సెన్షేషనల్ సక్సెస్ అయిన ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు భారీ మొత్తానికి సితార ఎంటర్ టైన్ మెంట్స్ వారు హక్కులు దక్కించుకున్నారు.ఇప్పుడు పవన్ కు భారీ మొత్తంలో పారితోషికం ఇచ్చి రీమేక్ పనులు మొదలు పెట్టారు.
ఈ సినిమాను 150 కోట్ల టార్గెట్ తో రూపొందించబోతున్నారు.కేవలం 3 నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ చాలా సీరియస్ గా దర్శకుడికి చెప్పాడట.
దాంతో ఖచ్చితంగా సమ్మర్ చివరి వరకు సినిమా వచ్చే అవకాశం ఉందంటున్నారు.ఈ సినిమా తర్వాత పవన్ చేయబోతున్న సినిమాల జాబిత చాలానే ఉంది.
క్రిష్ దర్శకత్వంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా సినిమా ఉంటుంది.