హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో అంతిమంగా టిఆర్ఎస్ గెలిచింది.బొటాబొటిగా సీట్లు రావడంతో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉన్నా , మేయర్ పదవిని మాత్రం టిఆర్ఎస్ దక్కించుకోవడం ఖాయం అయిపోయింది.
ఎంఐ ఎంతో తప్పనిసరిగా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం టిఆర్ఎస్ కు ఏర్పడింది.టిఆర్ఎస్ గెలుచుకున్న స్థానాలతో పాటు , ఎక్స్ అఫిషియో ఓట్లు లెక్క వేసుకున్నా, తప్పనిసరిగా పొత్తు అవసరంగా మారింది.
ఇది ఇలా ఉంటే, గ్రేటర్ మేయర్ ఎవరు అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది.గత గ్రేటర్ మేయర్ పదవి బీసీలకు కేటాయించగా, ఈసారి జనరల్ మహిళలకు రిజర్వు కావడంతో ఓసి మహిళలు ఆశలు ఈ పదవి పై ఆశలు పెట్టుకున్నారు.
టిఆర్ఎస్ గెలుచుకున్న స్థానాలలో 23 మంది మహిళలు ఉండడంతో, వారిలో ఎవరికి కేసీఆర్ అనుగ్రహం ఉంటుంది అనేది లెక్క తేలడం లేదు.రెండోసారి కార్పొరేటర్ గా గెలిచిన వారికి మేయర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్టు గా టిఆర్ఎస్ లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, విజయా రెడ్డి , సింధు రెడ్డి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అయితే ఇంకా అనేకమంది మహిళలు ఈ పదవికి పోటీ పడుకున్నారు.చింతల శాంతి, సింధు రెడ్డి, విజయ రెడ్డి, మాధవరం రోజా రావు వంటి వారు ఉండగా, బీసీల నుంచి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కే.కేశవరావు కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి తనకు మేయర్ పదవి వస్తుంది అని ఆశలు పెట్టుకున్నారు.
అయితే కేశవరావు కి రెండోసారి రాజ్యసభ అవకాశం ఇవ్వడంతో విజయలక్ష్మి పేరు పరిగణలోకి తీసుకోవడం లేదు. అలాగే ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి సైతం ఈ పదవికి పోటీ పడుతున్నారు.అయితే గ్రేటర్ ఫలితాలు వెలువడిన తర్వాత సింధు రెడ్డి ని కెసిఆర్ స్వయంగా పిలిపించుకుని అభినందనలు తెలపడంతో , ఆమె కాబోయే మేయర్ అనే ప్రచారం జరుగుతుండగా, దివంగత పి జనార్దన్ రెడ్డి కుమార్తె విజయ రెడ్డి ఈ రేసులో గట్టిగానే పోటీ పడుతుండడంతో ఈ ఇద్దరిలో ఎవరికి మేయర్ కుర్చీలో కూర్చుని అదృష్టం దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.
అసలు ఈ విషయం లో కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో ?