చంద్రబాబు తన తీరుకు భిన్నంగా తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును ప్రకటించారు.చంద్రబాబు టిక్కెట్ల కేటాయింపు అంటే నాన్చి చివరి వరకు తేల్చరు.
అయితే తిరుపతి ఉప ఎన్నికకు మరో మూడు నెలల సమయం ఉండగానే చంద్రబాబు తిరుపతి ఎంపీ అభ్యర్థిని ప్రకటించి సొంత పార్టీ నేతలకే ఆశ్చర్యం కలిగించారు.దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా ? అన్నది కూడా ఎవ్వరికి అంతు పట్టడం లేదు.
తన పేరును చంద్రబాబు ప్రకటించాక పనబాక లక్ష్మి కనీసం మీడియా ముందుకు కూడా రాలేదు.తన పేరు ప్రకటించిన రోజు ఆమె చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.దీంతో ఆమెకు అసలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంట్రస్టు ఉందా ? అన్న అనుమానాలు కూడా సొంత పార్టీ నేతలకే కలుగుతున్నాయి.అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుపతి పార్లమెంటులో టీడీపీ గెలిచే పరిస్థితి లేదు.
ఈ విషయం పనబాకకు కూడా తెలుసు.ఆమె ఎలాగూ ఓడిపోతానని డిసైడ్ అయ్యారనే అంటున్నారు.పైగా ఆమెకు స్థానికంగా నియోజకవర్గాల్లో ఉన్న నేతలు సహకరించే పరిస్థితి లేదు.
ఇప్పుడు ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు ఖర్చు దండగ, టైం వేస్ట్ అని అక్కడ నేతలు చర్చించుకుంటోన్న పరిస్థితి ఉంది.గత ఎన్నికల్లోనే ఆమె ఏకంగా కేంద్ర మాజీ మంత్రిగా ఉండి కూడా 2.28 లక్షల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు.
పనబాక కూడా తనకు టీడీపీ టిక్కెట్ ఇచ్చినా గెలుపుపై నమ్మకం లేక ఆమె బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
గతంలో నెల్లూరు ఎంపీ సీటు ప్రకటించాక ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలోకి జంప్ కొట్టి ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు.ఇప్పుడు పనబాక కూడా వీలుంటే బీజేపీ లేదా ఏదైనా అనూహ్యం జరిగి వైసీపీ నుంచి ఆఫర్ లాంటిది వస్తే ఆ పార్టీలోకి అయినా వెళ్లేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు.
ఏదేమైనా పనబాకకు చంద్రబాబు, టీడీపీపై అయితే నమ్మకం లేదనే తెలుస్తోంది.