ఈ స్వతంత్ర భారతదేశంలో కొన్ని కొన్ని సంఘటనలు వింటే ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా?’ అన్న ఓ మహానుభావుని పంక్తులు గుర్తుకు వస్తాయి.లేదంటే కలికాలపు ఖర్మ అని సరిపెట్టుకోవాలి తెలియదు కానీ, స్మశానవాటికను కబ్జా చేయడమేమిటి మరి, విడ్డురం కాకపోతే! అధికారం వున్నవాడు అణాపైసాని కూడా వదలదన్నట్టు.
అణగారిన వర్గాల ఆస్తులను ఎలాగూ లూటీ చేస్తున్నారు.ఇంకా ఏం కరువయ్యిందని ఆఖరికి స్మశానవాటికను కూడా వదలట్లేదు? వారి సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో తెలియక ఆ గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
గ్రామకంఠం భూమి కబ్జా కావడంతో, బంధుమిత్రుల మధ్య జరగాల్సిన అంత్యక్రియలు. పోలీసుల బందోబస్తు మధ్య జరపుకోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు.తమకు శాశ్వత శ్మశాన వాటిక కేటాయించాలని అర్దిస్తున్నారు వారు.జీవితమంతా కష్టపడి.
ఆయువు తీరిన తర్వాత చివరి మజిలీకి చేరాల్సిన 6 అడుగుల స్థలం కోసం గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఆ గ్రామస్థులు.తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టు పంచాయతీలోని మిట్టమీద కండ్రిగ గ్రామస్థులకు శ్మశానం లేదంటే మీరు నమ్ముతారా? కానీ ఇది వాస్తవం.
శ్మశాన వాటికగా ఉన్న భూమిని రెవెన్యూ అధికారులతో లాలూచీ పడి ఓ వ్యక్తి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.కాగా విధిలేని పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు మరోచోట శ్మశాన స్థలం కేటాయించారు.
అయితే ఆ స్థలంలో గ్రామస్థులు ఫెన్సింగ్ వేయడానికి.సిమెంటు దిమ్మలు, ఇనుప కమ్ములను తెచ్చి నాటడానికి ప్రయత్నిస్తుండగా ఈ స్థలం తమదేనంటూ మళ్లీ అదే వ్యక్తి రావడంతో వారు ఖంగు తిన్నారు.
దాంతో గ్రామస్థులు మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఆ భూమిపై ఎవరికీ ఎలాంటి హక్కులు లేవని అధికారులు నిర్ధారించారు.
అయితే ఈ భూమి తనదేనన్న గ్రామస్తుడికి చట్టపరంగా నోటీసులు ఇచ్చి, తగిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు చెప్పినా వినడానికి ఆ గ్రామస్తులు మాత్రం సిద్ధంగా లేరని తెలుస్తోంది.