కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల వెంకటేశ్వరుడిని రోజుకు కొన్ని లక్షల మంది దర్శించుకుంటారు.ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో తిరుమల కూడా ఒకటి.
ఇక్కడి వచ్చి ఒక్కసారి వెంకటేశ్వరుడిని దర్శించుకుంటే తమ జన్మ ధన్యం అవుతుందని భక్తులు భావిస్తారు.అలాంటిది తిరుమల ఆలయం మూతపడనున్నదనే విషయాన్ని స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించడంతో భక్తులు అయోమయంలో పడ్డారు.
అయితే ఇది కేవలం హిందూ ఆచారం ప్రకారం జరిగే ప్రక్రియ అని వారు తెలిపారు.డిసెంబర్ 25, 26వ తేదీల్లో దాదాపు 13 గంటలపాటు తిరుమల ఆలయం మూసివేయనున్నారు.దీనికి కారణం డిసెంబర్ 26న సూర్యగ్రహణం ఉండటమే అని పండితులు తెలిపారు.26వ తేదీన ఉదయం 8.08 నుంచి 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడనుంది.క్షేత్ర సంప్రదాయం ప్రకారం సూర్యగ్రహణం ఏర్పడే సమయానికి ముందే, అంటే 6 గంటల సమయం ముందే ఆలయ ద్వారాలు మూసేయనున్నారు.
ఈ లెక్కన డిసెంబర్ 25న రాత్రి 11 గంటలకు తిరుమల ఆలయం మూసివేస్తారు.
సూర్యగ్రహణం ముగిసిన తరువాత ఆలయ సంప్రోక్షణ చేసి మళ్లీ ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి.ఈ విషయాన్ని భక్తులు అందరూ గమనించాలని ఆలయ అధికారులు తెలిపారు.భక్తులు ఈ విషయంలో సహకరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరింది.