సమయం చెప్పడం అంటే గడియారం చూసి చెప్పడం కాదు.కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి గడియారం ఒక్కటే సరిగా పని చేస్తోందని, అందుకే ఆయన సరైన టైం చెబుతారని అర్థం కాదు.
ఇది సరైన సమయం కాదని వెంకయ్య నాయుడు వై కా పా అధినేత జగన్ని ఉద్దేశించి అన్నారు.దేనికి సరైన సమయం కాదు? జగన్ చేయాలనుకుంటున్న ఆమరణ నిరాహార దీక్షకు సమయం కాదని వెంకయ్య అభిప్రాయం.ఎపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 7వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయాలని జగన్ నిర్ణయించారు.ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోవడంతో దీక్ష అనేక సార్లు వాయిదా పడింది.
చివరకు 7వ తేదీ నిర్ణయించారు.ప్రజా సమస్యల మీద ఆందోళన చేసే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉందని, జగన్ కూడా చేయవచ్చని, కానీ అందుకు ఇంకా సమయం రాలేదని వెంకయ్య అన్నారు.
సరైన సమయంలో, సరైన ప్రాంతంలో దీక్ష చేయాలన్నారు.వెంకయ్య ఇలా ఎందుకు అంటున్నారు? కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధంగా లేదు.ఆ విషయం ప్రజలకు తెలిసిపోయింది.ఇప్పటికే ప్రజలకు బీజేపీ అంటే మోసం చేసిన పార్టీ అనే ఫీలింగ్ ఏర్పడింది.జగన్ దీక్షతో ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగే ప్రమాదం ఉంది.గొడవలు అయ్యే అవకాశం ఉంది.
అందుకే వెంకయ్య నేరుగా దీక్ష మానుకోమని చెప్పకుండా ఇది సరైన సమయం కాదని అంటున్నారు.మరి ఆ సమయం ఎప్పుడో వెంకయ్య చెబుతారా?
.