ఏపీలో హోరాహోరీగా సాగిన ఎన్నికల యుద్ధంలో గెలుపు ఎవరిది ? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎప్పుడూ లేనన్ని రోజుల వెయిటింగ్ లో పెట్టేసింది ఎన్నికల కమిషన్.ఈ నెల 23 తో ఆ టెన్షన్ కాస్తా తొలిగిపోనుంది.
అయితే ఆ తేదీ దగ్గరకు వచ్చే కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ బాగా పెరిగిపోతోంది.గెలుపు ఓటమి అనే విషయంలో ఎవరి అంచనాల్లో వారు ఉన్నప్పటికీ ఫలితాల కోసం అభ్యర్థులు ఆందోళనగా ఎదురుచూపులు చూస్తున్నారు.
ఏపీలో రాజకీయంగా సెంటిమెంట్ జిల్లాలుగా పేరుపొందిన గోదావరి జిల్లాల్లో ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ పార్టీలు సహా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.ఫలితాల్లో తమ జాతకం ఏ విధంగా బయటపడుతుందో అన్న భయం అభ్యర్ధులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
ఎన్నికల ఫలితాలపై ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తూ అభ్యర్థులకు ధైర్యం నూరిపోస్తున్నా ఎక్కడో తెలియని భయం అయితే అన్ని పార్టీల్లో కనిపిస్తోంది.గత ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న టీడీపీ ఇప్పుడు కూడా తిరుగులేని మెజార్టీతో సీట్లు సాధించి మరోసారి అధికారం దక్కించుకుంటామనే ధీమాను వ్యక్తం చేస్తోంది.
ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఒకవైపు ఈవీఎం లలో మోసాలు జరిగాయని, కేంద్రం కుట్రలు చేసింది అని పదే పదే చెప్తూనే 130 సీట్లు వస్తాయని ధీమాగా చెప్తూ అభ్యర్థులకు ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు.ఇక కొత్తగా వచ్చిన జనసేన పార్టీకి గెలుపు ధీమా లేదు.
అందుకే తమకు సీట్లు ముఖ్యం కాదు అంటూ ఆ పార్టీ అధినేత పవన్ ముందే ఫలితాలను ఊహించి చేపిస్తున్నాడు.
అలాగే వైసీపీ మాత్రం గెలుపు తమదే అంటూ ధైర్యంగా చెప్తోంది.అంతే కాదు తమ పార్టీ గెలవబోతోంది అనే సర్వే రిపోర్ట్స్ ను కూడా సాక్ష్యంగా చూపిస్తోంది.ఎవరెంత ధీమా వ్యక్తం చేస్తున్నా అభ్యర్థుల్లో టెన్షన్ మాత్రం తగ్గడంలేదు.
గత ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అనే విధంగా పోరు రసవత్తరంగా సాగింది.కాకపోతే ఆ ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ గా బీజేపీ, పవన్ కళ్యాణ్ ఉండడంతో టీడీపీ విజయం దక్కించుకుంది.
కానీ ఇప్పుడు పవన్ జనసేన పేరుతో పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడంతో పవన్ చీల్చే ఓట్లు ఎవరికి వరం, ఎవరికి నష్టం అనే విషయం స్పష్టంగా తెలియక టీడీపీ, వైసీపీ అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.