ఒకప్పుడు ఎన్నికల ప్రచారమంటే సభలు, ర్యాలీలు, సమావేశాలు, కరపత్రాల పంపిణీతో మోత మోగిపోయేది.కానీ కాలం మారింది.
సోషల్ మీడియా రంగ ప్రవేశం తర్వాత రాజకీయ రంగస్థల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.వాట్సాప్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ఫాంల పుణ్యమా అని రాజకీయ పార్టీలు, నేతలు నిత్యం ప్రజలతో నేరుగా అనుసంధానంలో ఉండగలుగుతున్నాయి.
డిజిటల్ సాంకేతికత, స్మార్ట్ఫోన్ల హవా, కారుచౌకగా ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో నేతలు ఈ సౌకర్యాలను అందిపుచ్చుకుంటున్నారు.
టీవీలు, పత్రికల్లో ప్రచారం చేయడం ఖర్చుతో కూడుకున్నది.
ఈ ఖర్చు కంటే చౌకగా, వేగంగా, వీలైనంత ఎక్కువ మందిని చేరేలా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవచ్చు.పైగా వాటి ద్వారా వెలువడే సమాచారం నిమిషాల్లో వైరల్గా మారుతుంది.
అందుకే ఇప్పుడు దేశంలో రాజకీయ పార్టీలన్నీ తమ నేతలకు సోషల్ మీడియాలో ఖాతాలు తప్పనిసరి చేశాయి.ప్రతి పార్టీ తన మేనిఫెస్టో, విధానాలు, ఆలోచనలను ప్రజలకు చేరవేసేందుకు సోషల్ మీడియాకు ప్రాధాన్యతనిస్తున్నాయి.
నిత్యం తమ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అభిమానులు, అనుచరులు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి.ఇప్పుడు ప్రతి పార్టీ లక్ష్యం యువతే.
ఎందుకంటే అన్ని దేశాల్లోనూ అభ్యర్ధుల గెలుపొటములను ప్రభావితం చేసేది యువతరమే.అందుకే వారే టార్గెట్గా ప్రపంచంలోని అన్ని పార్టీల ప్రచారం సాగుతోంది.
ఇప్పుడు ఇదే స్ట్రాటజీని అమలు చేయనున్నారు భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్.త్వరలో జరగనున్న కెనడా ఫెడరల్ ఎన్నికలకు సంబంధించి ఆయన సారథ్యం వహిస్తున్న న్యూడెమొక్రాటిక్ పార్టీ దూసుకెళ్తోంది.
ఈ నేపథ్యంలో ఎన్నికలు మరో నాలుగు రోజులే గడువు వుండటంతో ఓటర్లకు చేరువయ్యేందుకు గాను జగ్మీత్ సింగ్ సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకున్నారు.ఈ మేరకు తన డ్యాన్స్ వీడియోలను టిక్టాక్ సహా ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లపై షేర్ చేశాడు జగ్మీత్.
ఆయన షేర్ చేసిన వీడియోలకు మిలియన్కు పైగా వీక్షణలు లభించాయి.
కెనడా రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో జగ్మీత్ ఒకరు.
అతని నాయకత్వం, ప్రభావం, రాజకీయాలు ఒక్క భారతీయ సమాజానికే పరిమితం కాలేదు.ఇతనికి కెనడాలోనే జనాభా పరంగా అతిపెద్ద ప్రావిన్సులైన బ్రిటీష్ కొలంబియా, అంటారియోలలో గట్టి పట్టుంది.
మొత్తం కెనడా జనాభాలో భారతీయులు కేవలం 4 శాతం మంది మాత్రమే వున్నారు.అయితే వారి ఓట్లు మాత్రం కీలకమన్నది సుస్పష్టం.
అంటారియో, బ్రిటీష్ కొలంబియా, అల్బెర్టా, మానిటోబా వంటి ప్రావిన్సులలో భారతీయుల ప్రభావం వుంది.
తాజాగా వెలువడుతున్న సర్వేల ప్రకారం.జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమొక్రాటిక్ పార్టీ మరోసారి కింగ్ మేకర్ అయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.తాజా పరిణామాలు లిబరల్స్, కన్జర్వేటివ్స్ మధ్య హోరాహోరి పోరు సూచిస్తున్నందున.రెండు ప్రధాన పార్టీలు మెజారిటీ పొందలేకపోతే చిన్న పార్టీల మద్ధతు అవసరం.2019లో జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీకీ 157 సీట్లు వచ్చాయి .338 మంది సభ్యులున్న హౌస్ ఆఫ్ కామన్స్లో అధికారాన్ని అందుకోవడానికి ట్రూడోకి 13 మంది సభ్యుల మద్ధతు కావాలి.అటు కన్జర్వేటివ్స్కు 121 సీట్లు వచ్చాయి.
జగ్మీత్ సారథ్యంలోని ఎన్డీపీ 24 స్థానాలు గెలుచుకుంది.దీంతో జగ్మీత్ మద్ధతుతో ట్రూడో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.