పిల్లల్ని కని పెంచి పెద్ద చేస్తే వారి అవసరాలన్నీ తీర్చిన తల్లిదండ్రులు వారి సొంత కాళ్లపై నిలబడినప్పుడు వారికి ఆ తల్లిదండ్రులు పడిన కష్టం గుర్తు రాదు.మా కోసం ఏం చేశావంటూ తల్లిదండ్రులను నిలదీసి నిర్ధాక్షణ్యంగా ఇంట్లో నుంచి బయటకు పంపుతున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం.
ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా ప్రజలలో మార్పు రాకపోవడం గమనార్హం.సొంత కడుపున పుట్టిన పిల్లలే కాదని బయటకు పంపించడంతో ఎంతోమంది నిరాశ్రయులుగా రోడ్లపై కనిపిస్తున్నారు.
పిడికెడు అన్నం కోసం బిచ్చమెత్తుకుంటున్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు.అచ్చం ఇలాంటి ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.
కరీంనగర్ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామానికి చెందిన అల్లాడి ముకుందరావు అనే వృద్ధుడికి ఐదుగురు సంతానం.
పిల్లలను పెంచి పోషించడానికి ఐదెకరాల పొలం సంపాదించాడు.వారిలో ఇద్దరు కూతుళ్లు కాగా వారికి పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపారు.అందులో పెద్ద కూతురు మరణించింది.కొన్ని నెలల క్రితమే ముకుందరావు భార్య చనిపోవడంతో పెద్ద కొడుకు వద్ద ఆశ్రయం పొందుతున్నాడు.
అయితే పెద్ద కొడుకు ఆర్టీసీ డ్రైవర్ కావడంతో తన కుటుంబ పోషణ తనకు భారం అయిందని భావించి తన తండ్రిని ఇంటి నుంచి బయటకు పంపాడు.
మిగతా ఇద్దరు కుమారులు కూడా తన తండ్రి పోషణ భారమైందని అతనిని ఇంటి నుంచి బయటకు పంపడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని ఆ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు.పోలీసులకు జరిగిన విషయమంతా చెప్పాడు.ముగ్గురు కొడుకులు ఉన్న మూడు రోజుల నుంచి అన్నం లేక ఎంతో ఆకలిగా ఉందని చెప్పడంతో, పోలీస్ కానిస్టేబుల్ రాజేందర్,హోం గార్డ్ వెంకటేశ్వర్లు అతనికి భోజనం తెప్పించి కడుపునిండా అన్నం పెట్టారు.
మనస్ఫూర్తిగా అన్నం తిన్న ఆ వృద్ధుడు ఆ పోలీసులను నిండు మనసుతో ఆశీర్వదించాడు.అయితే ఎక్కడికి వెళ్లి తల దాచుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్న ముకుందరావుకు పోలీస్ స్టేషన్ లోనే ఆశ్రయం కల్పించి, తన ముగ్గురు కొడుకులతో మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని ఆ పోలీసులు వృద్ధుడికి భరోసా ఇచ్చారు
.