దీపావళి పండుగను పురస్కరించుకొని ఆ లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేసి ఆమె అనుగ్రహం పొందుతారు.అంతేకాకుండా ధన త్రయోదశి రోజు మన ఇంట్లో ఉన్న బంగారు నగలను అమ్మవారికి సమర్పించి పూజలు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నమ్ముతారు.
మరికొందరు ధన త్రయోదశి రోజు బంగారం కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తూ నగలను కొంటూ ఉంటారు.కానీ ఇక్కడ ఓ మహిళ దీపావళి పండుగను పురస్కరించుకుని తన ఇంట్లో ఉన్న బంగారు నగలను తీసుకెళ్లి చెత్తకుండీలో పడేసిన ఘటన పుణేలో చోటు చేసుకుంది.
ఆ మహిళకు బంగారం ఎక్కువై చెత్తకుండీలో పడేసింది అంటే మీరు పొరపాటు పడ్డట్టే.దీపావళి పండుగను జరుపుకోవడానికి ఇల్లు మొత్తం శుభ్రం చేస్తున్న నేపథ్యంలో, ఆ బంగారు నగలు ఉన్న సంచిని కూడా చెత్త తో పాటు కలిపేసి తీసుకెళ్లి మునిసిపల్ వాహనంలో పడేసింది.
అందులో దాదాపు 3 లక్షల రూపాయలు విలువ చేసే నగలు ఉన్నాయని తెలిపారు.చెత్తను పడేసిన కొన్ని గంటల తర్వాత ఆమెకు ఆ నగల సంచి గుర్తురావడం తో ఒక్క సారిగా గుండె జారిపోయినంత పని అయింది.
విషయం తెలుసుకున్న ఆమె వెంటనే స్థానిక సామాజిక కార్యకర్త అయినా సంజయ్ కుటేకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం తెలిపారు.దీంతో ఆయన వెంటనే పూణే మున్సిపాలిటీ హెల్త్ డిపార్ట్ మెంట్ కు సమాచారం ఇచ్చారు.
అయితే అప్పటికే ఆ చెత్తను డంప్ యార్డ్ కు తరలించారు.సానిటరీ ఇన్స్పెక్టర్ సుశీల్ మలాయీ ఆదేశాల మేరకు డేటా ఎనలిస్ట్ హేమంత్ లఖన్ చెత్తపడేసిన ఈ ప్రాంతానికి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు.
దాదాపు 40 నిమిషాల పాటు ఆసంచి కోసం గాలించి చివరకు గుర్తించారు.ఆ నగల సంచి దొరకడంతో మునిసిపాలిటీ అధికారులు ఆ కుటుంబానికి తెలియజేయడంతో మున్సిపాలిటీ ఆఫీస్ కి వచ్చి తమ నగల సంచిని తీసుకెళ్లారు.