దేశ రక్షణ కోసం సైనికులు చేసే త్యాగం ఎనలేనిది.ఎండ, వాన , చలి అనే తేడా లేకుండా మన రక్షణ కోసమే నిరంతరం శ్రమిస్తూ వుంటారు.
సరిహద్దుల్లో శత్రుమూకల ఆగడాలకు ధీటుగా సమాధానం చెబుతూనే మన దేశ భూభాగాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.అంతేకాదు.
ప్రకృతి విపత్తుల సమయంలోనూ మనకు అండగా వుంటూ వారు చూపే తెగువ సేవానిరతి కొనియాడదగినది.అలాంటి జవాన్ల కుటుంబాలు అన్నమో రామచంద్రా అంటూ ఆకలి కేకలు పెడుతున్నారు.
అది మనదేశంలో కాదు.అగ్రరాజ్యంగా.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా వున్న అమెరికన్ ఆర్మీలో.
‘ఫీడింగ్ అమెరికా’ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కరోనా దెబ్బకు సామాన్య ప్రజలతో పాటు సైనిక కుటుంబాలు సైతం తీవ్రంగా ప్రభావితమయ్యాయి.దిగువస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల జీతాలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదు.
దాదాపు 29 శాతం మంది తమ పిల్లలకు వేళకు ఆహారం అందించలేకపోతున్నారు అని ఫీడింగ్ అమెరికా సంస్థ సంచలన విషయాలు బహిర్గతం చేసింది.
చాలా మంది సైనికుల భార్యలు కూడా కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయారని ఈ సంస్థ తెలియజేసింది.
మహమ్మారికి ముందు సైనికుల భార్యలూ సైతం ఉద్యోగాలు చేసేవారు.భార్యాభర్తల ఆదాయాలతో సంసారం సాఫీగా సాగిపోయేది.
కానీ ఎప్పుడైతే కోవిడ్ దేశంలోకి ఎంట్రీ ఇచ్చిందో నాటి నుంచి పరిస్ధితులు తలక్రిందులయ్యాయి.ఊహించని ఈ పరిణామంతో ఇంట్లో కనీసం పిల్లలకు కూడా తిండిలేని పరిస్థితి నెలకొంది.
సైన్యం అనగానే భారీ జీతభత్యాలు అదనపు సౌకర్యాల వుంటాయని చాలామంది భావిస్తారు.కానీ పైకి తెలియని కోణాలు చాలా వున్నాయి.కోవిడ్తో సైనికుల జీవితాలు సైతం మేడిపండేనని సామాన్యలకు తెలిసింది.మరోవైపు కుటుంబాలకు తిండి దొరకడం లేదన్న పరిస్ధితి సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఈ విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని కాపాడటంపై వారు దృష్టిపెట్టలేరని రక్షణ నిపుణులు అంటున్నారు.ఈ సమస్య సైన్యంలోని అన్ని విభాగాల్లోనూ ఉందని తెలుస్తోంది.
దీనికి తోడు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో కరెంటు బిల్లులు చెల్లించలేక, చీకట్లోనే పలువురు కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.