కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే.భారత్ లో అడ్డూఅదుపు లేకుండా శరవేగంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతోంది.
ఒకవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుంటే మరోవైపు పలు దేశాల్లో విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా చోటు చేసుకుంటున్న ఘటనలు మానవాళిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.
తాజాగా న్యూ మెక్సికోలో వేల సంఖ్యలో పక్షులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి.మృతి చెందిన పక్షులు వలస పక్షులు కావడం గమనార్హం.శాస్త్రవేత్తలు పక్షుల మృతికి సంబంధించి కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు.అయితే న్యూ మెక్సికోలో మాత్రమే కాకుండా టెక్సాస్, కొలరోజా, అరిజోనో ప్రాంతాలలో కూడా పక్షులు చనిపోవడం గమనార్హం.
పరిశోధకులు ప్రాథమికంగా మారుతున్న వాతావరణ పరిస్థితులే పక్షుల మృతికి కారణమని అంచనాకు వచ్చారు.
అయితే పరిశోధకులు వాతావరణ పరిస్థితులే కారణమని తేల్చినా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
సాధారణ పక్షులతో పాటు బ్లూ బర్డ్స్, ఫ్లై కాచర్స్, బ్లాక్ బర్డ్స్ లాంటి అరుదైన పక్షులు కూడా చనిపోయిన పక్షుల్లో ఉన్నాయని పరిశోధకులు తెలుపుతున్నారు.న్యూ మెక్సికోకు సమీపంలో కొన్ని రోజుల క్రితం కార్చిచ్చు సంభవించింది.
మరోవైపు ఇక్కడ తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇవి కూడా పక్షుల మృతికి కారణాలు కావచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఎన్ఎంఎస్యూ జీవ శాస్త్రవేత్త మర్తా డెస్మండ్ పక్షుల మృతి గురించి స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ ఘటనను అంత తేలికగా తీసుకోరాదని ఆయన పేర్కొన్నారు.భవిష్యత్తులో మరిన్ని పక్షులు ఇదే విధంగా చనిపోయే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.ఈ ఘటనను చాలా భయంకరమైన ఘటనగా చూడాలని పేర్కొన్నారు.
వేల సంఖ్యలో పక్షులు చనిపోవడంపై పక్షుల ప్రేమికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.