వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం ఈ రోజుల్లో పిల్లలకు బరువు గా మారిపోయింది.ఈ క్రమంలో తల్లి దండ్రులను వృద్ధాప్య ఆశ్రమాల్లో జేర్పించడం నడిరోడ్డుపై వదిలేయడం వంటి చర్యలకు పాల్పడుతుండడం చాలానే చూస్తూ ఉన్నాం.
తాజాగా ఏపీ లో ఒక ఘనుడు వృద్ధురాలైన తన తల్లి భారం అవుతుంది అని ఏకంగా ఆమె పీక కోసి హతమార్చాడు.ఈ ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం తోటపల్లి లో చోటుచేసుకుంది.
అక్కడి పోలీసుల వివరాల ప్రకారం తోటపల్లికి చెందిన బోపిరెడ్డి ముత్తమ్మ (70), ముక్కయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.ఒక కొడుకు, కూతురికి వివాహాలు అయ్యాయి.
దీంతో భర్త ముక్కయ్య, చిన్న కుమారుడు నాగులుతో కలిసి ముత్తమ్మ ఉంటోంది.ముత్తమ్మ వృద్దాప్య దశకి చేరడంతో ఆమె తరచూ అనారోగ్యానికి గురవుతోంది.
వైద్యానికి డబ్బు ఖర్చవుతోందని, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నానని తరచూ తల్లితో నాగులు గొడవకు పడేవాడు.అయితే కొంతకాలంగా ఆమె పూర్తిగా మంచానికే పరిమితమవ్వడం తో ఆమెకు సేవలు చేయలేక నాగులు తరచూ విసుక్కునేవాడు.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తండ్రి కట్టెలు తెచ్చేందుకు వెళ్లడంతో అదే అదనుగా భావించిన నాగులు కత్తితో తల్లి గొంతు కోసి హతమార్చినట్లు తెలుస్తుంది.అనంతరం ఏమీ చేయనట్లు, తనకు ఏమీ తెలియనట్లు నటించి అందరిని నమ్మించాడు.స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి ఆ దుర్మార్గుడు ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.