ఏపీ చాలా రోజుల నుంచి మంత్రివర్గ ప్రక్షాళన పై చర్చ జరుగుతూనే ఉంది.ప్రస్తుత మంత్రి మండలిని పూర్తిగా ప్రక్షాళన చేసి, కొత్తవారికి జగన్ అవకాశం కల్పించబోతున్నారని , ఇప్పటికే ఒక లిస్టు తయారు చేసుకున్నారనే ప్రచారం చాలా రోజుల నుంచి వినిపిస్తూనే ఉంది .
దీనికి తగ్గట్లుగానే జగన్ వ్యవహారం కూడా కనిపిస్తోంది.అయితే కొత్తగా చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం దక్కుతుందని చాలామంది జగన్ కు విధేయులుగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు.
అయితే జగన్ అనుగ్రహం ఎవరి మీద ఉందో ఇప్పుడు వరకు స్పష్టంగా తెలీదు.ఇదిలా వుంటే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల సమయంలో జగన్ కొంత మందిని నియోజకవర్గంలో నియమించారు.
అయితే కడప జిల్లాకు చెందిన నేతల కంటే దూరంగా ఉన్న జిల్లాలోని కొంతమంది కీలకమైన ఎమ్మెల్యేలను బద్వేలు నియోజకవర్గంలో ఇన్చార్జిలుగా జగన్ నియమించడంపై అప్పట్లో చర్చ జరిగింది.
కడప జిల్లాలో వైసీపీ కి 10 మంది ఎమ్మెల్యేలు కర్నూలులో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
అలాగే కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో మొత్తం నలుగురు మంత్రులు ఉన్నారు.మొత్తం వీరందరిలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు, సుధీర్ రెడ్డి జమ్మలమడుగు, శ్రీకాంత్ రెడ్డి రాయచోటి, రఘురాం రెడ్డి మైదుకూరు లను మాత్రమే ఇన్చార్జిగా నియమించారు.
అలాగే అనంతపురం జిల్లాకు చెందిన తోపుదుర్తిప్రకాష్ రెడ్డి (రాప్తాడు )నీ నియమించారు.మొత్తం బద్వేల్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఇన్చార్జిగా చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పారు.
ఇక అదే జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నెల్లూరుకు చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి వారిని ఈ నియోజకవర్గం లో ఇన్చార్జిలుగా నియమించారు.
ఎన్నికల ఫలితం కూడా జగన్ ఊహించినదానికంటే మెరుగ్గా వచ్చింది.అయితే కడప జిల్లాకు చెందిన వారి కంటే ఇతర జిల్లాలకు చెందిన వారికి నియోజకవర్గంలో జగన్ బాధ్యతలు ఎందుకు అప్పగించారు అనేది ఎవరికి అంతుపట్టలేదు.అయితే ఈ ఉప ఎన్నికల్లో ఇన్చార్జిగా నియమించిన వారు జగన్ కు అత్యంత సన్నిహితులు.
వారు ఖచ్చితమైన ఫీడ్ బ్యాక్ అందిస్తారనే ఉద్దేశంతో వారిని నియమించారని ఒక వైపు ప్రచారం జరుగుతుండగా, త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుతం వ్యవహరించిన ఎమ్మెల్యేలకు జగన్ మంత్రులుగా అవకాశం కల్పించబోతున్నారని, అందుకే ఇతర జిల్లాలకు చెందిన వారైనా, కీలకమైన వారందరినీ ఈ నియోజకవర్గంలో నియమించి వారి పనితీరు జగన్ అంచనా వేశారని ప్రచారం ఇప్పుడు వైసీపీలోనే జరుగుతోంది.