అధికార పార్టీ అంటే భయమో, భక్తో ఇంకొకటో తెలియదు గానీ , 2019 లో వైసీపీ అధికారంలోకి రాగానే పెద్దఎత్తున టిడిపి నుంచి , ఇతర పార్టీల నుంచి నాయకులు ఆ పార్టీలోకి వెళ్లిపోయారు.కొంతమంది ఎన్నికలకు ముందే వెళ్లగా, మరికొంతమంది ఎన్నికల తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు.
అధికార పార్టీ కావడంతో తమకు అన్ని పనులు సులువుగా అయిపోతాయని, తమకు పార్టీలో ఎక్కడాలేని ప్రాధాన్యం దక్కుతుందని చాలామంది అంచనా వేశారు.దీంతోపాటు పార్టీలో కీలకమైన పదవులు తమకు అప్పగిస్తారని చాలామంది ఊహించి పార్టీలో చేరిపోయారు.
అయితే కొంతమంది మాత్రమే సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి.
పదవుల గురించి పార్టీ నేతలను గట్టిగా ప్రశ్నిద్దాం అంటే ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారు చాలామంది పార్టీలో ఉన్నారు.
వారి తరువాతే మీకు ప్రయారిటీ ఉంటుందనే విధంగా వైసీపీ కీలక నాయకులు సంకేతాలు ఇస్తుండటంతో మరో దారి లేక సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే చాలామంది ఈ తరహా నాయకులకు, మొదటినుంచి వైసీపీలో ఉన్న వారికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుండడం, గ్రూపు రాజకీయాలు పెరిగిపోతుండడంతో, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు వైసీపీలో ఇమడలేక బయటకు వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లి పోతే జరిగే నష్టం ఏమిటో తెలియడం తో , చాలామంది ఈ గ్రూపు రాజకీయాలు తట్టుకుంటూనే వస్తుండగా, మరికొందరు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీలో ప్రాధాన్యం కోల్పోతున్నారు.దీంతో వలస వచ్చిన నాయకులంతా పార్టీలోనే చివరివరకు కొనసాగుతారా అంటే అనుమానంగానే ఉంది.పార్టీలో గ్రూపు రాజకీయాల కారణంగా వలస వచ్చిన నేతలు అంతా యాక్టివ్ గా ఉండే లేకపోవడంతో వారి వల్ల పార్టీకి, పార్టీ వల్ల వారికి ఉపయోగం లేకపోవడం సరికొత్త చర్చకు తెర తీస్తోంది.