ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా పని చేయకున్నా డబ్బులు వస్తున్నప్పుడు పని చేయాల్సిన అవసరం ఏంటి అనుకుంటూ ఉంటారు.అతి కొద్ది మంది మాత్రమే డబ్బు తీసుకుంటున్నందుకు పని చేయాలని అనుకుంటారు.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల టీచర్ల విషయానికి వస్తే స్కూల్కు పిల్లలు వస్తే పాఠాలు చెప్తాం లేదంటే ఖాళీగా కూర్చుని వెళ్తాం అనుకునే వారు చాలా మంది ఉంటారు.కాని కొందరు మాత్రం విద్యార్థులను తీసుకు వచ్చేందుకు కాస్త ప్రయత్నిస్తారు.
అయితే కర్నాటక లోని ఉడిపికి దగ్గర్లోని బారాలి అనే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజారాం మాత్రం చాలా భిన్నం అని చెప్పుకోవాలి.
బారాలి గ్రామంలోని స్కూల్లోని విద్యార్థుల సంఖ్య తగ్గుతూ తగ్గుతూ వస్తోంది.
కారణం ఆ స్కూల్కు చుట్టుపక్కల ఉన్న ఊర్ల పిల్లలు రావడం మానేస్తున్నారు.ఆ స్కూల్కు రావాలి అంటే అయిదు ఆరు కిలోమీటర్ల అభయారణ్యం దాటుకుని రావాల్సి ఉంటుంది.
అలా వస్తున్న సమయంలో ప్రమాదాలు తరుచు జరుగుతున్నాయి.దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల చదువు మాన్పించి ఇంటి వద్దనే ఉంచుతున్నారు.
పిల్లల చదువు గురించి వారికి ఆలోచన ఉన్నా కూడా ఏం చేయలేక పిల్లల చదువు విషయమై అభ్యంతరం పెట్టడం తల్లిదండ్రుల వంతు అయ్యింది.
తల్లిదండ్రుల భయంను అర్ధం చేసుకున్న రాజారాం మరియు ఆ గ్రామంకు చెందిన ఇతర ఉపాధ్యాయులు బడి మానేసిన పిల్లలను మళ్లీ స్కూల్కు తీసుకు రావాలని ఆలోచించారు.ఆ సమయంలోనే ఆయనకు ఒక సూపర్ ఐడియా తట్టింది.ఆ స్కూల్కు చెందిన టీచర్స్ మరియు గ్రామ పెద్దల సహకారంతో ఒక పాత స్కూల్ బస్సును రాజారాం కొనుగోలు చేశాడు.
తనకు డ్రైవింగ్ వచ్చిన కారణంగా ప్రతి రోజు ఉదయాన్నే 8 గంటలకు పిల్లల కోసం బస్సును చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లే వాడు.స్కూల్ మానిపించిన దాదాపు 100 మంది పిల్లలు బస్సు కారణంగా మళ్లీ స్కూల్కు జాయిన్ అయ్యారు.
ఇందుకోసం ఆయన ప్రతి రోజు పడుతున్న కష్టం మామూలుది కాదు.ఆయన డ్రైవింగ్ చేసుకోవడంతో పాటు, ఆ బస్సు మెయింటెన్స్ మరియు డిజిల్ వ్యవహారాలు రాజారాం చూసుకునేవాడు.
ప్రతి నెల తనకు వచ్చే జీతం నుండి దాదాపుగా సగం వరకు ఆ పిల్లలను స్కూల్కు తీసుకు వచ్చేందుకు ఖర్చు చేసేవాడు.అతడికి కొందరు దాతలు ముందుకు రావడం, సహకారం అందించడం చేయడంతో ఆయన తన పనిని విజయవంతంగా చేయడం జరుగుతుంది.
ప్రతి రోజు తాను ఉండే ప్రాంతంకు బండి పై వెళ్లి అక్కడ నుండి బస్సులో గ్రామాలకు వెళ్లి పిల్లలను తీసుకు రావడం, మళ్లీ సాయంత్రం సమయంలో స్కూల్ నుండి పిల్లలను ఇంటికి పంపించడం, మళ్లీ గ్రామం నుండి బస్సును స్కూల్ వరకు తీసుకు రావడం చేసేవాడు.అలా ప్రతి రోజు నాలుగు ట్రిప్పులను బస్సు డ్రైవ్ చేసేవాడు.ఒక ప్రభుత్వ టీచర్ అంత కష్టపడి పిల్లలను స్కూల్కు తీసుకు రావడం దేశంలోనే ఒక అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.ఆ వంద మంది పిల్లలు ప్రస్తుతం చదువుకుంటున్నారంటే ఖచ్చితంగా రాజారాం సార్ వల్లే అంటూ స్థానికులు అంటూ ఉంటారు.
అందుకే ఆయన్ను ఉడిపి ఏరియాలో రియల్ హీరో రాజారాం సార్ అంటూ పిలుస్తారు.