రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతూనే ఉన్నాయి.ముఖ్యంగా గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు అనుసరించిన విధానాన్ని బీసీలు,ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు తట్టుకోలేక పోతున్నారు.
అప్పట్లో తమకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని వారు ఇప్పటికీ కుమిలిపోతున్నారు.పార్టీకి బీసీలే వెన్నెముక అంటూ.
పదే పదే చెప్పే చంద్రబాబు అప్పట్లో బీసీలకు పదవులు ఎన్ని ఇచ్చారో గుర్తు చేసుకోవాలని ఆయా వర్గాలకు చెందిన నాయకులు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు, ఎస్సీ ఎస్టీ వర్గాల వారు కూడా ఇదే ప్రశ్న లేవనెత్తుతున్నారు.
తమను గుర్తించడంలో చంద్రబాబు విఫలమయ్యారని వారు స్పష్టంగా వాదిస్తున్నారు.తాజాగా పార్టీ పార్లమెంటరీ పదవులు బీసీలకు ఇచ్చారు.
అదేసమయంలో పార్టీ ఏపీ చీఫ్గా అచ్చెన్నాయుడుకు అవకాశం ఇస్తున్నట్టు అధికారికంగానే ప్రకటించారు.ఇక, అదేసమయంలో ప్రధాన కార్యదర్శిగా బీద రవిచంద్రయాదవ్ను ప్రకటించారు.
నిజానికి ఇప్పుడు దక్కిన పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం బాగానే పెరిగింది.దీంతో పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్న వాదనను తప్పించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని బాబు భావించారు.
కానీ, చిత్రంగా ఆయా వర్గాలు మాత్రం.తమ ఆవేదనను ఆపుకోలేక పోతున్నారు.ప్రస్తుతం ప్రకటించిన పదవులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పార్టీని బీసీలు మోయాల్సి వస్తోందని అంటున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కు బీసీలు గుర్తుకు వస్తారని, అదే అధికారంలోకి వస్తే.మాత్రం ఓసీ నేతలు, ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులు మాత్రమే గుర్తుకు వస్తారని నిష్టురంగా మాట్లాడుతున్నారు.
పార్టీలో ఇలాంటి సంస్కృతి ఉంటే.ఎప్పటికీ కష్టమేనని కూడా చెబుతున్నారు.నిజమేనా? పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలు, అధికారంలోకి రాగానే బాబు సామాజిక వర్గం.రంగంలోకి దిగడం.! అనే చర్చ ప్రారంభమైంది.మరి దీనిని పోగొట్టడం బాబుకు చాలా కష్టమే అంటున్నారు పరిశీలకులు.