కార్తీకమాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం.ఈ నెలలో శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతుంటాయి.
ఆ శివుడికి ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలతో భక్తులు పెద్ద ఎత్తున దేవాలయాలను దర్శించి పూజలు చేసి స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతుంటారు.అలాగే విష్ణు దేవాలయాలలో కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో విష్ణు భగవానుడిని పూజిస్తుంటారు.
ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో తులసి, ఉసిరి వంటి వృక్షాలను దేవతా వృక్షాలుగా భావించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.ఈ నెల మొత్తం సాయంత్ర సమయంలో తులసి కోట దగ్గర కార్తీక దీపాలను వెలిగించడం ద్వారా శుభం జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
అలాగే కార్తీక మాసంలో కొన్ని వస్తువులను దానం చేయడం ద్వారా సర్వ పాపాలు తొలగిపోయి ఎంతో పుణ్యం కలుగుతుందని వేద పండితులు చెబుతుంటారు.
కార్తీకమాసం అనగానే కార్తీక స్నానాలు, దీపారాధన, ఉపవాస దీక్షలు వంటి నియమనిష్టలతో స్వామి వారిని పూజిస్తుంటారు.
ఇంతటి పవిత్రమైన కార్తీకమాసంలో కొన్ని పనులను చేయటం ద్వారా, కొన్ని రకాల ఆహార పదార్థాలను తినటం ద్వారా స్వయంగా సమస్యలను కొనితెచ్చుకున్నట్లు అవుతుందని పండితులు చెబుతున్నారు.అయితే కార్తీక మాసంలో ఎటువంటి పనులను చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం….
కార్తీకమాస పూజలు, ఉపవాస దీక్షలు చేసే వారు ఈ నెల మొత్తం ఇంగువ, ఉల్లిపాయ, గుమ్మడి కాయ, వెల్లుల్లి శనగపప్పు, పెసరపప్పు, నువ్వులను కార్తీకమాసంలో తినకూడదని వేద పండితులు తెలియజేస్తున్నారు.అలాగే ఆదివారం రోజున కొబ్బరికాయ, ఉసిరికాయను తినకూడదు, భోజనం చేసే సమయంలో మౌనంగా భోజనం చేయాలి.
ఇలాంటి నియమాలను పాటించడం ద్వారా ఎటువంటి సమస్యలు లేకుండా, సుఖ సంతోషాలను కలిగి ఉంటారు.ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ఆ పరమశివుని అనుగ్రహం కలిగి సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో ఎల్లప్పుడూ విజయాలను అందుకోవాలంటే తప్పకుండా ఈ నియమ నిబంధనలను పాటించాలని పురోహితులు తెలియజేస్తున్నారు.