అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఆరు నెలల పిల్లల వరకు తల్లి పాలు తప్పనిసరిగా అవసరం.ఆరు నెలల లోపు పిల్లలకు తల్లి పాలు మినహా మరేం ఇచ్చినా కూడా అంత ప్రయోజనం ఉండదు అనేది వైధ్యులు చెప్పే మాట.
తప్పనిసరిగా అమ్మ పాలు తాపించాల్సిందే.అయితే ఏవో కారణాల వల్ల పుట్టగానే తల్లులను కోల్పోయిన పిల్లలు అనాధాశ్రమంలో అత్యంత దారుణమైన పరిస్థితుల నడుమ డబ్బా పాలు తాగుతూ ఉంటారు.
నేపాల్లో కూడా ఇదే తరహాలో ఖాట్మండులోని బాల మందిర్లో 20 మంది చిన్న పిల్లలు తల్లి పాలకు నోచుకోలేదు.వారికి బాలమందిర్ నిర్వాహకులు డబ్బా పాలు పట్టిస్తున్నారు.
ఆ పిల్లలకు తల్లి పాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఆ ఆశ్రమం నిర్వాహకులు పిల్లలకు తల్లి పాలు కావాలి, ఎవరైనా అమ్మలు వారి కోసం డబ్బాలో తమ పాలను పట్టించాలని కోరారు.అలా కోరడంతో చాలా మంది అమ్మలు తమ పాలను డబ్బాలో పట్టి ఇస్తూ ఉండే వారు.
అలా కొంతలో కొంత అయినా ఆ అనాధ పిల్లల అమ్మ పాల ఆకలి తీరినట్లయ్యింది.ఆశించిన స్థాయిలో పాలు రాకపోవడంతో నిర్వాహకులు మళ్లీ డబ్బా పాలను కూడా వారికి పట్టించాల్సి ఉండేది.
అమ్మ పాలు తక్కువగా తీసుకునే పిల్లలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో తరచు జబ్బు పడుతూ ఉంటారు.అలా బాల మందిర్లోని పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉండేవి.
ఈ విషయం తెలుసుకున్న అనితా కుంపాహా, సానూ నగర్కోటి మరో ముగ్గురు మహిళలు అమ్మతనంకు అర్థం చెప్పేలా చేశారు.తమ పాలను డబ్బా ద్వారా పంపించడం కాకుండా ఏకంగా బాల మందిర్కు వెళ్లి ఆ పిల్లలకు అమ్మ పాలను మాత్రమే కాకుండా అమ్మ ప్రేమను కూడా పంచాలనుకున్నారు.అందుకోసం ఆ అయిదుగురు అమ్మలు వేరు వేరు ప్రాంతాల నుండి బాలమందిర్కు చేరుకునేవారు.అనితా కుంపాహా ఏకంగా 30 కిలో మీటర్ల దూరం నుండి ఆమె ప్రతి రోజు బాలమందిర్కు వచ్చే వారు.
అక్కడ పిల్లలను ఆడిస్తూ వారికి పాలిస్తూ ఈ అమ్మలు మద్యాహ్నం వరకు అక్కడే ఉండే వారు.
ఉదయం 11 గంటల నుండి మద్యాహ్నం 3 గంటల వరకు ఆ అయిదుగురు అమ్మలు కూడా బాల మందిర్లో ఉన్న 20 మంది చిన్నారులకు అమ్మలా పాలించడం, లాలించడం చేసేవారు.
అప్పుడప్పుడు మాత్రమే వీరు వారికి ప్రేమను పంచడం కాకుండా ప్రతి రోజు, ఎన్ని పనులు ఉన్నా కూడా వీరు మాత్రం పిల్లలను ఆడించేందుకు, ఆకలి తీర్చేందుకు వచ్చే వారు.ప్రతి రోజు బాల మందిర్లో పిల్లలకు ఇంతకు ముందు తరహాలో డబ్బాల ద్వారా అమ్మల పాలు సేకరించి కూడా అందిస్తున్నారు.
ఖాట్మండుకు చెందిన ఈ అయిదుగురు అమ్మలు ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.అమ్మ అంటేనే ప్రపంచంలోనే గొప్ప.అలాంటి అమ్మలు తమ స్థాయిని ఈ పనితో మరింతగా పెంచుకున్నారు.అమ్మ అంటే దైవంతో సమానం అంటారు.అయితే ఆ దైవత్వం తమ కడుపులో పుట్టిన పిల్లలకు మాత్రమే కాకుండా ఇతర అనాధ పిల్లలకు కూడా కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.అమ్మ పాలను ఇలా అనాధలకు ఇవ్వడం అనేది అద్బుతమైన ఆలోచన అని, అనాధలకు అమ్మ పాలను ఇచ్చేందుకు వచ్చిన ఆ మహిళలు నిజంగా గొప్ప వారు అంటూ అమెరికాకు చెందిన ఒక ప్రముఖ జర్నలిస్ట్ తన బ్లాగ్లో పేర్కొన్నాడు.
.