తెలంగాణలో కేసీఆర్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఎలాగైనా గద్దె దింపాలని కాంగ్రెస్తో పాటు బిజెపి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి.
గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బిజెపి ఎవరు ఊహించని విధంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీకి తెలంగాణలో 2024 పై ఆశలు రెట్టింపు అయ్యాయి.కేసీఆర్ కుమార్తె కవితను నిజామాబాద్ ప్రజలు ఓడించారంటే కెసిఆర్ పై ఉన్న వ్యతిరేకత ఏంటో అర్థం అవుతోంది.
పైగా పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ – కరీంనగర్ – నిజామాబాద్ ఎంపీ స్థానాల్లో సైతం బీజేపీ పాగా వేసింది.తాజాగా రైతుల్లో సైతం కెసిఆర్ ప్రభుత్వం పై తీవ్రమైన వ్యతిరేకత ఉందన్న విషయం తెలుస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లిలో రైతులు భారీ ధర్నా నిర్వహించారు.మొక్కజొన్న పండించే రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.వీరు తమ పంటను కొనేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోవడాన్ని నిరసిస్తూ వారు ఆందోళనకు దిగారు.ఈ ఆందోళనకు మూడు వేల మందికి పైగా రైతులు తరలి వచ్చారు అంటే ప్రభుత్వంపై వీరు ఎంత అసహనంతో ఉన్నారో అర్థమవుతుంది.
మొక్కజొన్నను ఇప్పటికే విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకోవడంతో పాటు… స్థానికంగా ఈ పంట భారీగా పండడంతో డిమాండ్ తగ్గిపోయింది.
ఈ క్రమంలోనే మొక్కజొన్న పంట కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మహాధర్నాలో పాల్గొన్న రైతులు ఏకంగా కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు ఇంటి పై రాళ్లు రువ్వారు.దీంతో ఈ ధర్నా తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
గత రెండు ఎన్నికల్లోనూ ప్రభుత్వానికి అండగా నిలిచిన రైతులు ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంటి పై రాళ్లు రువ్వడాన్ని బట్టి చూస్తే వారు ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతోంది.
నిజామాబాద్లో సీఎం కెసిఆర్ కుమార్తె కవిత ను సైతం ఓడించింది పసుపు రైతులు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఏదేమైనా కేసీఆర్ సర్కార్ పై రోజురోజుకు రైతుల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని నిజం.అలాగే ఉద్యోగ, మేథావి వర్గాల్లోనూ ఈ వ్యతిరేకత బాగా కనిపిస్తోంది.