గ్రేటర్ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి అగ్నిపరీక్షగా మారాయి.ఇటీవల కేసీఆర్ ఇలాకా అయిన మెదక్ జిల్లాలో ఆయన సొంత ప్రాంతం అయిన దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తన సిట్టింగ్ సీటును కోల్పోయింది.
ఆ పార్టీ నుంచి పోటీ చేసిన సోలిపేట సుజాత అవమానకరంగా ఓడిపోయారు.అక్కడ బీజేపీ గెలుపుతో ఆ పార్టీ శ్రేణుల్లో ఎక్కడా లేని జోష్ అయితే వచ్చింది.
మరోవైపు గ్రేటర్లో పట్టున్న కాంగ్రెస్ కూడా అస్తిత్వం కోసం పాకులాడుతోంది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపకపోతే ఆ పార్టీకి ఇక తెలంగాణలో నూకలు చెల్లినట్టే అవుతుంది.
ఇక గ్రేటర్లో పట్టున్న తెలుగుదేశం కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయనుంది.మరోవైపు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన సైతం ఈ ఎన్నికల్లో ఒంటరి పోరుకు రెడీ అవుతోంది.
ఇక హైదరాబాద్ ప్రజలకు అధికార టీఆర్ఎస్పై వ్యతిరేకత ఉందన్నది నిజం.కరోనా విషయంలో కావొచ్చు.వరదల సమయంలో కావొచ్చు.సరిగా పట్టించుకోలేదని చాలా మంది ప్రజలు మండిపడుతున్నారు.
మరోవైపు గ్రేటర్ రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి.ఇక వరదల సమయంలో చాలా చోట్ల టీఆర్ఎస్ కార్పొరేటర్లను ప్రజలు తమ ప్రాంతాల్లోకి రానివ్వనంత వ్యతిరేకత అయితే ఉంది.
కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలకు పడడం లేదు.ఇంత క్లిష్టమైన పరిస్తితులు ఉన్నా కూడా టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్లకే టిక్కెట్లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.బాగా అవినీతిలో ఉన్న ముగ్గురు ,నలుగురిని మాత్రమే పక్కన పెట్టనుంది.గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి 99 మంది కార్పొరేటర్లు గెలిచారు.ఆ ఎన్నికల్లో సెటిలర్లు, సీమాంధ్ర ప్రజలు టీఆర్ఎస్కు వన్సైడ్గా ఓట్లేశారు.ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి మరో ముగ్గురు కార్పొరేటర్లు చేరారు.
ఇక తాజా ఎన్నికలపై టీఆర్ఎస్ తమ పార్టీ గెలుపు ఓటములపై అంతర్గతంగా చేయించుకున్న సర్వేల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా.ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడంతో కనిష్టంగా 70 కార్పొరేటర్ స్థానాలు.
గరిష్టంగా 90 స్థానాలు వస్తాయని తేలిందట.ఇక కొన్ని సీట్లు తగ్గినా ఎంఐఎంకు 40 సీట్లు వస్తాయని.
ఎలాగైనా గ్రేటర్ పీఠం తమ పార్టీ ఖాతాలోనే పడుతుందని టీఆర్ఎస్ ధీమాగా ఉంది.