సార్వత్రిక ఎన్నికలకు ఏపీలో ఇంకా సమయం ఉన్నా వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ మాత్రం ముందస్తుగానే అలర్ట్ అవుతూ తమ పార్టీ నాయకులను చేస్తున్నారు.ఈసారి గెలుపు దక్కాలి అంటే గట్టిగా కష్టపడాల్సిందేనని జగన్ పదేపదే హెచ్చరికలు చేస్తున్నారు.
తమ రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేసే విధంగా పార్టీలోని ప్రతి నాయకుడు పనిచేయాలని , కేవలం పార్టీ పైన, తన పైన భారం వేసి ఎన్నికలకు వెళ్తామంటే కుదరదని, ప్రజల్లో గ్రాఫ్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని పదే పదే చెబుతున్నా.మంత్రులు, ఎమ్మెల్యేలు అంత సీరియస్ గా తను మాటలను తీసుకోవడం లేదనే అసంతృప్తి జగన్ లో చాలా కాలం నుంచి ఉంది.
సందర్భం వచ్చినప్పుడల్లా తన అసంతృప్తిని బయటపెడుతూనే ఉన్నారు.తనపై ప్రజల్లో సదాభిప్రాయం ఉందని, తన పాలనపై మంచి మార్కులే వచ్చాయని, కానీ ఎమ్మెల్యేల పనితీరు అంతంత మాత్రంగానే ఉందని జగన్ అనేక సందర్భాల్లో చెప్పారు.
ఎమ్మెల్యేలు నిత్యం జనాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని చెబుతున్నా స్పందన అంతంత మత్రంగానే ఉండడంతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లేలా చేశారు.ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని పదేపదే పార్టీ నుంచి సూచనలు, హెచ్చరికలు చేస్తున్నా మంత్రులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంపై జగన్ ఆగ్రహం చెందుతున్నారు.
తాజాగా జగన్ పార్టీ కార్యక్రమాలను సీరియస్ గా తీసుకోని వారిపై ఫైర్ అయ్యారు.మొత్తం 27 మంది జగన్ ఆగ్రహానికి గురయ్యారు.వారిలో నలుగురు మంత్రులు ఉన్నారు.ఎప్పుడు లేని విధంగా మంత్రులు ఎమ్మెల్యేల పేర్లను బహిరంగంగా చెప్పి వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో… ముందు ముందు సీరియస్ గానే ఉండబోతున్నాను అనే సంకేతాలను జగన్ పంపించారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని, ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోకపోతే టికెట్ ఇచ్చేది లేదని జగన్ స్పష్టం చేశారు.నవంబర్ ఆఖరి వారంలో మరోసారి సమావేశం ఉంటుందని, ఎవరి పనితీరు ఏమిటనేది చివరి ఆరు నెలల్లో చెబుతానని అప్పుడే టికెట్లు ఇచ్చేది లేనిది కూడా ప్రకటిస్తామని జగన్ క్లారిటీ ఇచ్చారు.ఇక మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ళ నాని వంటి వారి పనితీరుపైన జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇక ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు జగన్ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.
అయితే జగన్ ఆగ్రహం వెనుక ఆవేదన కూడా ఉన్నట్టు స్పష్టమవుతుంది.పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను ఎంత సీరియస్ గా వర్క్ చేస్తున్నా.అంత సీరియస్ నెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులలో కనిపించడం లేదని అలాగే ప్రతిపక్షాలు తమ పార్టీ పైన తమ కుటుంబ సభ్యుల పైన విమర్శలతో విరుచుకుపడుతున్నా, తనకు సన్నిహితులుగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కనీసం నోరు మెదపడం లేదని కేవలం ఒకరిద్దరు మాత్రమే ఆ విమర్శలను తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నారని , మిగతావారు సైలెంట్ గా ఉండిపోతున్నారనే బాధ జగన్ లో స్పష్టంగా కనిపిస్తోంది.