ముల్లును ముల్లుతోనే తీయాలి అని పెద్దలు చెప్తుంటారు.ఈ పద్ధతినే బీజేపీ హుజురాబాద్లో ఫాలో అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇంకా రాలేదు.కానీ, అప్పుడే నియోజకవర్గంలో రాజకీయం భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.
కాగా, ఈ ఉప ఎన్నిక ద్వారా ఈటల రాజకీయ భవిష్యత్తు, అధికార టీఆర్ఎస్ పార్టీ బలం తేటతెల్లం కానున్నది.హుజురాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ గట్టెక్కేందుకుగాను ‘దళిత బంధు’ స్కీమ్ను తీసుకొచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
అయితే, ఈ పథకాన్ని ఆహ్వానిస్తూనే బీజేపీ కౌంటర్ అటాక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు.
ఇక హుజురాబాద్లో బీజేపీ తరఫున బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రజల్లో ఉన్నాడు.‘ప్రజాదీవెన యాత్ర’ పేరిట పాదయాత్ర చేస్తుండగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తాజాగా ఆయన కోలుకున్నాడు.త్వరలో మళ్లీ పాదయాత్ర చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.కాగా, దళిత బంధు తో కేవలం నియోజకవర్గంలోని దళితులకే న్యాయం జరుగుతుందని, ఇతర సామాజిక వర్గాలకూ ‘బంధు’ రావాల్సిన అవసరముందని బీజేపీ బలంగా ప్రచారం చేయబోతున్నట్లు వినికిడి.మొత్తంగా పథకాన్ని ఆహ్వానిస్తూనే అందులోని డొల్లతనాన్ని బయటపెట్టేందుకు బీజేపీ సరంజామా సిద్ధం చేసుకుంటోంది.
ఈ క్రమంలోనే కమలం పార్టీ అధినాయకత్వాన్ని, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తదితరులను బీజేపీ ప్రచారపర్వంలో దించబోతున్నది.
మొత్తంగా టీఆర్ఎస్ వ్యూహాలకు చెక్ పెట్టి ఈటల రాజేందర్ను గెలిపించాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు.అయితే, ‘దళిత బంధు’ వంటి పథకం గట్టెక్కిస్తుందని కేసీఆర్ భావిస్తుండటం రాజకీయ ఎత్తుగడనే కాగా, బీజేపీ కూడా అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నదని, ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.హుజురాబాద్ ఉప ఎన్నిక ఒకరకంగా మినీ 2023 అసెంబ్లీ ఎన్నికనే అని చెప్పొచ్చని అంటున్నారు.
తాజా వార్తలు