అమెజాన్ అడవులను భూమికి ఊపిరితిత్తులుగా పేర్కొంటారు శాస్త్రవేత్తలు.ప్రపంచానికి అవసరమైన ఆక్సిజన్లో 20 శాతం ప్రాణవాయువును ఈ అడవులే అందిస్తున్నాయి.
దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, పెరూ, కొలంబియాల్లో విస్తరించిన ఈ అడవులు జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు.ప్రపంచంలోని జీవ వైవిధ్యంలో 10 శాతం ఈ అడవుల్లోనే ఉంది.
ప్రపంచానికి అవసరమైన ఆక్సిజన్లో 20 శాతాన్ని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అందిస్తోంది.ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ అడవులు మనిషి స్వార్థానికి కాలిబూడిదవుతున్నాయి.
దీనికి తోడు విలువైన వృక్ష సంపద కోసం కొందరు అక్రమార్కులు అరుదైన వృక్షజాలాన్ని నాశనం చేస్తున్నారు.ఈ క్రమంలో ఈ అడవుల సౌందర్యానికి, ప్రకృతి రమణీయతకు ఫిదా అయిన భారత సంతతికి చెందిన ఓ న్యాయవాది తన జీవితాన్ని అమెజాన్కు అంకితం చేశారు.
భారత్లోకి కేరళకు చెందిన షాజీ థామస్ అనే వ్యక్తి 1989లో డాక్టరేట్ పట్టా పొందిన అనంతరం బ్రెజిల్ వెళ్లాడు.అప్పడికే మూడు పోస్ట్ డాక్టోరల్ అధ్యయనాలు పూర్తి చేశాడు.
ఈ ప్రకృతి ప్రేమికుడు అమెజాన్ నదిపై పడవనే ఇల్లుగా చేసుకుని నివసించాడు.
బ్రెజిల్లో తన జీవితం గురించి వార్తాసంస్థ ఐఏఎన్ఎస్తో షాజీ మాట్లాడుతూ.
తాను 1989 చివరిలో సావో పాలోకు ఒక విదేశీ శిక్షణా కార్యక్రమం కింద వచ్చానని వెల్లడించారు.తాను ఇక్కడకు వచ్చినప్పుడు ఈ దేశం అధిక ద్రవ్యోల్బణంతో తిరోగమన దిశలో వుందని థామస్ పేర్కొన్నారు.
బ్రెజిల్ ధనిక దేశమే అయినప్పటికీ, అవినీతి రేటు ఎక్కువగా వుంది.చాలా ఏళ్లపాటు దేశంలో అధికారంలో వున్న మితవాద ప్రభుత్వం ధనిక వర్గానికి అనుకూలంగా వుంది.బ్రెజిల్ విస్తీర్ణంలో భారత్ కంటే మూడు రెట్లు పెద్దదని అయితే ఇక్కడ ధనిక, పేద వర్గాల మధ్య అంతరం చాలా స్పష్టంగా కనిపిస్తుందని థామస్ చెప్పారు.తాను బ్రెజిల్ వచ్చిన వెంటనే, ఇక్కడ భూమిలేని నిరాశ్రయులు నిర్వహించిన ఉద్యమాలను చూసినట్లు ఆయన తెలిపారు.1990లో తొలిసారిగా అమెజాన్ అడవులను సందర్శించానని.అక్కడ సాంప్రదాయ గిరిజన ప్రజలతో జీవించే అవకాశం వచ్చిందని థామస్ గుర్తుచేసుకున్నారు.
విస్తారమైన అమెజాన్ అడవులు, దాని సహజ వనరులు ప్రపంచం నలుమూలల నుంచి చాలా మందిని ఆకర్షిస్తాయని ఆయన చెప్పారు.
ఇక తన స్వస్థలం గురించి తెలియజేస్తూ… తాను ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టానని.కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లా పలైలోని రామపురంలో పెరిగానని ఆయన వెల్లడించారు.తన మేనమామలు సంపన్నులని.
చిన్నతనంలో ఎప్పుడూ వారి ఇంటికి వెళ్తూ వుండేవాడినని తెలిపారు.నాన్న స్థానికంగా పేరున్న రాజకీయ నాయకుడని, అలాగే ఆయనకు పర్యావరణమంటే ఎంతో ఇష్టమని థామస్ గుర్తుచేసుకున్నారు.
మైసూర్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు తాను అమెజాన్ అడవులపై ఇష్టాన్ని పెంచుకున్నానని థామస్ పేర్కొన్నారు.జీవితంలో ఎప్పటికైనా అమెజాన్ అడవులను చూడాలని కలలు కన్నట్లు వెల్లడించారు.
పర్యావరణ, సామాజిక కార్యకర్తగా, అమెజాన్లోని స్థానిక జనాభా కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని థామస్ స్పష్టం చేశారు.