ప్రపంచ వ్యాప్తంగా శరణార్ధుల బాధలు ప్రతి దేశంలో కూడా ప్రపంచాన్ని ఆవేదనకి గురి చేస్తున్నాయి.దేశంలో అంతర్గత ఘర్షణల కారణంగా చాలా మంది ప్రజలు ఇతర దేశాలకి శరణార్ధులుగా తరలి వెళ్ళిపోతూ ఉంటారు.
సిరియా మారణహోమం సమయంలో ఎంతో మంది శరణార్ధులు దేశం విడిచి వెళ్ళిపోతున్నారు.వీరిలో చాలా మంది నాటు పడవల మీద దాటే సమయంలో సముద్రంలో మునిగి చనిపోతున్నారు.
ఇలా ఈ దశాబ్ద కాలంలో లక్షల సంఖ్యలో శరణార్ధులు ప్రాణాల కోసం పరుగులు తీసి సముద్రంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు.ఇప్పుడు అలాంటి మరో సంఘటన ప్రపంచం మొత్తం కలచివేసింది.
ఎల్ సల్వడార్కు చెందిన ఆస్కార్ ఆల్బెర్టో మార్జినెజ్ రామినెజ్ అనే వ్యక్తి దేశంలో అంతర్గత ఘర్షణల కారణంగా దేశం నుంచి అమెరికాకు వెళ్లిపోయి ప్రశాంతంగా బతకాలని అనుకున్నాడు.
తాను పుట్టిన దేశంలోనే తన భార్య, కూతురికి రక్షణ ఉండదని అనుకున్న ఆస్కార్ తన భార్య, కూతుర్ని కూడా తనతోపాటు అమెరికా తీసుకువెళ్లాలని అనుకోని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు.
అయినప్పటికీ అగ్రరాజ్యం నుంచి స్పందన రాకపోవడంతో మెక్సికో బోర్డర్ నుంచి అమెరికాలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.భార్య, కూతురితో అమెరికా, మెక్సికో బోర్డర్ దగ్గర ఉన్న రియో గ్రాండే నదిని ఈదుకుంటూ దాటి అమెరికాలోకి ప్రవేశించాలని అనుకున్నాడు.
కూతుర్ని తన వీపుకు కట్టుకుని ఈదుకుంటూ అవతలి పక్కకు వెళ్లి అక్కడ దింపి తిరిగి భార్యను తీసుకురావడానికి వస్తున్న సమయంలో తండ్రి తనను వదిలి వెళ్లిపోతున్నాడేమోనని భయపడిన కూతురు వెంటనే తండ్రితో పాటు నీళ్లలోకి దూకేసింది.కూతురు ప్రవాహంలో కొట్టుకుపోకుండా రక్షించిన ఆస్కార్ కూతురిని తన షర్టుకు కట్టుకున్నాడు.
అదే సమయంలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో దురదృష్టవశాత్తూ తండ్రీ, కూతుళ్లిద్దరూ చనిపోయారు.వీళ్ళు మెక్సికో బోర్డర్ కి కొట్టుకోచ్చారు.
ఇప్పుడు ఈ తండ్రి, కూతుళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు ఈ సంఘటన సంచలనంగా మారింది.