భారత దేశం వ్యవసాయం ప్రధాన వృత్తి కలిగిన దేశం.ఒకప్పుడు దేశంలో ఉన్న రైతుల శాతంతో పోల్చితే ఇప్పుడు రైతుల శాతం చాలా వరకు తగ్గిందని చెప్పుకోవాలి.
రైతులు అంటే సమాజంలో చులకన భావం ఏర్పడినది.వ్యవసాయం చేసేవారు సంపాదించలేరు అనే నిర్ణయానికి సమాజంలో అంతా వచ్చారు.
వ్యవసాయం చేయడం వల్ల పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం కూడా వచ్చే పరిస్థితి లేదని, రైతులు అప్పులు చేసి, ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే అంటూ అందరి అభిప్రాయంగా పడిపోయింది.కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, వ్యవసాయంలో లాభాలు దక్కించుకోలేక పోవడం వల్ల యువత వ్యవసాయం అంటేనే ఆమడ దూరం వెళ్తున్నారు.
రైతులు కూడా వారి పిల్లలను వ్యవసాయం వైపుగా ప్రోత్సహించడం లేదు.అందుకే దేశంలో రైతుల సంఖ్య చాలా తగ్గుతుంది.అయితే రైతులు కష్టపడి, ఆధునిక వ్యవసాయంను చేస్తే అంతకు మించిన బిజినెస్ లేదని కొందరు నిరూపిస్తున్నారు.నేలకు తగ్గ పంటను వేస్తూ, రేటు వచ్చే పంటలను సాగు చేయడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవచ్చు అని పలువురు ఆదర్శ రైతులు నిరూపించారు.
ఉత్తర ప్రదేశ్కు చెందిన రామ్ సరణ్ అనే రైతు కూడా ఈ విషయాన్ని నిరూపిస్తున్నాడు.సంవత్సరంకు 48 లక్షల రూపాయలు సంపాదిస్తున్న రామ్ సరణ్ ను యువ రైతులు ఆదర్శంగా తీసుకుంటున్నారు.
రామ్ సరణ్ ఎవరు? ఏం చేశాడు? దేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోకు 30 కిలోమీటర్ల దూరంలో దవల్పూర్ అనే గ్రామం ఉంది.ఆ గ్రామంకు చెందిన వ్యక్తి రామ్ సరణ్ వర్మ.
ఈయన మూడు తరాల కుటుంబ సభ్యులు కూడా ఉన్న నాలుగు ఎకరాల్లో సాంప్రదాయ పద్దతిలో వ్యవసాయం చేస్తూ వస్తున్నారు.వర్మ 10వ తరగతి వరకు చదువుకున్నాడు.ఆ తర్వాత ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఏదో ఒక జాబ్ చేయాల్సి వచ్చింది.ఆ సమయంలోనే వర్మకు వ్యవసాయం చేయాలనే ఆలోచన వచ్చింది.
కుటుంబ సభ్యులు మాత్రం వ్యవసాయం వద్దని వారించారు.వ్యవసాయంపై మక్కువతో దాదాపు రెండు సంవత్సరాల పాటు చుట్టు పక్కల రాష్ట్రాలు మరియు ప్రాంతాల్లో జరుగుతున్న వ్యవసాయం గురించి వర్మ తెలుసుకున్నాడు.ఎక్కడైన రైతులు మంచి పంటలు వేస్తున్నారని తెలిస్తే వెంటనే అక్కడికి వెళ్లేవాడు.వారు అనుసరిస్తున్న విధానాలను తెలుసుకునేవాడు.అలా వ్యవసాయంపై అవగాహణ పెంచుకున్నాడు.1988లో వర్మ వ్యవసాయం చేయడం ఆరంభించాడు.
మొదటి సంవత్సరంలో అరటి తోట పెట్టడం వల్ల ఆయన లాభాలను దక్కించుకున్నాడు.సహజ పద్దతిలో అరటి పెంపకం వల్ల పెద్దగా లాభాలు రావని నిర్ణయించుకున్న అతడు కణజాల పద్దతిలో విత్తనాలను అభివృద్ది చేసి, పంట సాగు చేశాడు.
అరటిలో కణజాల పద్దతిని వాడిన మొదటి రైతుగా వర్మ నిలిచాడు.అక్కడ నుండి వెనక్కి తిరిగి చూడకుండా వర్మ సంవత్సరం సంవత్సరంకు కొత్త కొత్త పద్దతుల్లో వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు.
మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అరటి పండ్లను మాత్రమే పండివ్వాలనే నిర్ణయానికి వచ్చాడు.ఆ వంగడాలకు ఎక్కువ శ్రమ, ఖర్చు ఎక్కువ అయినా కూడా వెనక్కు తగ్గకుండా అరటి తోటను పెట్టాడు.
విదేశీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఎర్ర అరటి పండ్లను పండివ్వడం ద్వారా మంచి లాభాలు వస్తాయని నిర్ణయించుకుని అటుగా అడుగులు వేశాడు.ఈయన తోటలో పండే పంటలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న వర్మను అప్పట్లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా అభినందించారు.
వర్మ మాత్రం తనకు ఎన్ని అవార్డులు వచ్చినా కూడా తనకు ఎక్కువ సంతోష పెట్టే విషయం మాత్రం పట్టణాల్లోంచి జనాలు మా ఊరికి వచ్చి పనులు చేస్తున్నారు.
దాదాపు 20 వేల మంది మా ఊర్లో వ్యవసాయం ద్వారా ఉపాది పొందుతున్నారు.ఇతర ప్రాంతాల్లో పల్లెటూర్ల నుండి పట్టణాలకు వలస వెళ్తే, మా ఊరికి పట్టణాల నుండి వస్తున్నారు.
ఇదే నేను సాధించిన విజయంగా చెప్పుకుంటాను అంటాడు వర్మ.
కృషి ఉంటే మట్టిలో మాణిక్యం పుట్టించవచ్చు అనేది సామెత.ఆ సామెతను వర్మ నిజం చేశాడు.ఎంతో మంది వర్మలు మనలో నుండి కూడా తయారు అవ్వొచ్చు.
కాస్త శ్రద్ద పెడితే వ్యవసాయంలో అద్బుతాలు ఆవిష్కరించవచ్చు.అయిదు ఎకరాల భూమి ఉంటే పెద్ద వ్యాపార సంస్థ ఉన్నట్లేనని, ఆ వ్యాపార సంస్థ నుండి ఎలా అయితే లాభాలు వస్తాయో వ్యవసాయ భూమి నుండి కూడా లాభాలు వస్తాయని వర్మ ను చూస్తే అనిపిస్తుంది.