సాధారణంగా ఇళ్లల్లో ఎవరు లేనప్పుడు దొంగలు చొరబడి విలువైన వస్తువులను, డబ్బులను, నగలను దోచుకుని వెళ్లడం గురించి మనం వినే ఉంటాము.కానీ ఈ దొంగలు మాత్రం కాస్త వెరైటీ అనే చెప్పాలి.
ఎందుకంటే ఈ దొంగలు నగలు, డబ్బులు కాజేయల్లేదు.క్రికెట్ బ్యాట్స్ ను మాత్రం చోరీ చేసారు.
అవును మీరు విన్నది నిజమే.కొంతమంది దొంగలు క్రికెట్ జట్టుపై దాడి చేసి, అందులోని క్రికెట్ సామాగ్రిని దోచుకెళ్లిన ఘటన ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరంలో జరిగింది.
అసలు వివరాల్లోకి వెళితే.షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా టాస్మానియాతో మ్యాచ్ ఆడడానికి ముందుగా క్వీన్స్ ల్యాండ్ జట్టు వాహనంపై ఎవరో గుర్తు తెలియని దొంగలు దాడి చేసిఆ వాహనంలోని క్రికెట్ కిట్ లతో పాటు మరికొన్ని సామాగ్రిని అపహరించారు.
క్వీన్స్ ల్యాండ్ జట్టు బస చేసే హోటల్ పార్కింగ్ లో ఉన్న వాహనం అద్దాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.ఆ జట్టు వికెట్ కీపర్ జిమ్మీ పియర్సన్ కు చెందిన రెండు బ్యాట్లతో పాటు ఇతర క్రికెట్ సామాగ్రిని దొంగిలించారు.
ఈ విషయాన్ని క్రికెట్ ఆటగాడు పియర్సన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు.అలాగే తన కొత్త మోడల్ గ్యారీ నికెల్స్ స్టిక్కర్ బ్యాట్ లు కొన్ని దొంగలించబడ్డాయని అవి ఎవరికైనా దొరికితే తనకు సమాచారం ఇవ్వాలని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన దక్షిణ ఆస్ట్రేలియా పోలీసులు దొంగల ముఠా గుట్టు రట్టు చేసే ప్రయత్నంలో పడ్డారు.విచారణలో భాగంగా హోటల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.కాగా క్వీన్స్ ల్యాండ్ – టాస్మానియా జట్ల మధ్య సెప్టెంబర్ లో జరగవలిసిన మ్యాచ్ కొత్తగా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవ్వడంతో ప్రస్తుతానికి ఇరు జట్ల మధ్య మ్యాచ్ ను వాయిదా వేశారు.