ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత వై.ఎస్.
రాజశేఖరరెడ్డికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అశేషమైన అభిమానులున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇకపోతే వైఎస్ఆర్ వల్ల చాలా మందికి రాజకీయ భవిష్యత్తు బాగుపడిందని రాజకీయ వర్గాలు పేర్కొంటుంటాయి.
వైఎస్ఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చాలా మందికి రాజకీయంగా అనేక పదవులు ఇచ్చారని పలువురు చెప్తుంటారు.కాగా, ఇటీవల వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వై.ఎస్.విజయమ్మ ‘ఆత్మీయ భేటీ’ పేరిట హైదరాబాద్లో ఓ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి పార్టీలకతీతంగా అన్ని పార్టీల్లోని నేతలను ఆహ్వానించారు.ఈ మీటింగ్కు అన్ని పార్టీల నుంచి కీలక నేతలు హాజరవుతారని విజయమ్మ భావించినట్లు తెలుస్తోంది.కానీ, కొందరు నేతలు మాత్రమే హాజరయ్యారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు మీటింగ్కు రాలేదు.వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ఎంతగానో అభిమానించే మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సభకు గైర్హాజరయ్యారు.అయితే, రోశయ్య పెద్ద వయసు ఉన్న వ్యక్తి కావడం వల్ల ఆరోగ్యం సహకరించ రాకపోయి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.కానీ, వైఎస్ఆర్కు అత్యంత సన్నిహితులైన చాలా మంది నేతలు రాలేదు.
ఆత్మీయ సభ రాజకీయ సభగా మారుతుందేమోననే కారణంతోనే చాలా మంది ‘ఆత్మీయ భేటీ’కి రాలేదని సమాచారం.ఇకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీలు ‘ఆత్మీయ భేటీ’కి వెళ్లొద్దంటూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
కాగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సభకు హాజరయ్యారు.అయితే, అందరూ అనుమానించినట్లుగానే ఆత్మీయ సభ కాస్తా రాజకీయ సభగా మారడం గమనార్హం.
దివంగత వైఎస్ఆర్ తనయ షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీ స్థాపించి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగా, ఆమెకు అండగా నిలవాలని ‘ఆత్మీయ భేటీ’లో విజయమ్మ అభ్యర్థించారు.ఇకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలు తన కుటుంబం, తన బాధ్యతని, తన గుండెలపై వైఎస్ఆర్ ఈ మేరకు విల్లు రాశారని షర్మిల పేర్కొంది.
మొత్తంగా విజయమ్మ, షర్మిల వ్యాఖ్యలతో ఆత్మీయ సభ కాస్తా రాజకీయ సభగా మారిపోయింది.ఇలా జరుగుతుంది అని తెలిసే చాలా మంది ఈ ఆత్మీయ భేటీకి రాలేదని తెలుస్తోంది.