రాజకీయాల్లో నాయకుల వలసలు సర్వ సాధారణం.ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మారుతూ తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
మాములు రోజుల్లో ఈ వలసలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా ఎన్నికల సమయంలో మాత్రం ఈ వలసలకు ఎక్కడలేని ప్రాధాన్యం ఉంటుంది.పార్టీలు మారే నాయకుల హడావుడితో సందడి సందడి వాతావరణం నెలకొంటుంది.
అయితే వారు పార్టీలు మారే క్రమంలో అనేక లెక్కలు, చిక్కులు ఉంటాయి.అందుకే నాయకులు ముందుగా ముహూర్త బలం, జాతకాలు చూసుకుని పార్టీ మారుతుంటారు.
ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావుడి ఎక్కువ అవ్వడంతో టీడీపీ – వైసీపీ పార్టీల్లో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పార్టీ మారే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు.ఇప్పటికే కొంతమంది పార్టీలు మారిపోగా మరికొంతమంది మంచి ముహూర్తం కోసం వేచి చూస్తున్నారు.
ఈనెల 8, 9 తేదీలలో మంచి ముహూర్త బలం ఉండడంతో అనేక మంది తమ జాతకాలను అనుసరించి ఎంతో మంచి రోజులు అనే నమ్మకంతో ఈ తేదీల్లో పార్టీలు మారాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.అందుకే ఈ రెండు రోజుల్లోనే పార్టీలు మారాలని, టిక్కెట్లు ఖరారు చేసుకోవాలని, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు జ్యోతిష్యులు సూచిస్తున్నారు.ఈనెల 8వ తేదీ విదియ తిథి.ఉత్తరాభాద్ర నక్షత్రం.ఇవి రెండూ దాదాపు అందరికీ కలిసి వచ్చేఅనుకూలించే తిథి.నక్షత్రం అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.
ఎన్నికల సంఘం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నా తీసుకోకపోయినా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మాత్రం 8వ తేదీ శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మాత్రం తమకు బాగా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
9వ తేదీన ఫాల్గుణ శుద్ధ తదియ, రేవతి నక్షత్రం.ఈ ముహూర్తంలో ఎవరు ఎటువంటి పని మొదలుపెట్టినా బాగా కలిసొస్తుందని జ్యోతిష్యులు నమ్మకంగా చెప్పడంతో పార్టీలు మారే వారు ఈ రెండు తేదీలను పరిగణలోకి తీసుకున్నారు.ఇదే ముహూర్తాల్లో టీడీపీ నాయకులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి వంటి వారు వైసీపీలో చేరుతున్నారు.
అలాగే వైఎస్సార్సీపీ నుంచి టీడీపీ లోకి గౌరు చరిత దంపతులు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.ఆంధ్ర అక్టోఫస్ లగడపాటి రాజగోపాల్ కూడా ఈ రెండు రోజుల్లోనే టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడని ప్రచారం జరుగుతోంది.