ఇద్దరూ మొండి వారే .ఇద్దరూ ముందుచూపు ఉన్న వారే.
ఇద్దరూ ఎన్నో కష్టాలను అనుభవించిన వారే.ఈ ఇద్దరూ రాజకీయాలను ఏ మలుపు అయినా తిప్పగల సమర్దులే.
ఈ ఇద్దరూ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించే మేధావులే.ఇలా ఒకే రకమైన భావజాలం, తెలివితేటలు, మొండితనం అన్ని ఉండడంతో నే, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య స్నేహం ఈ స్థాయిలో చిగురించింది అన్నట్లుగా వారు వ్యవహరిస్తూ ఉండేవారు.
అలాగే ఇద్దరికీ రాజకీయ బద్ధశత్రువు టీడీపీ అధినేత చంద్రబాబే కావడంతో, వీరి మధ్య స్నేహం మరింతగా పెనవేసుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడానికి కేసీఆర్ అందించిన అండదండలను అటు జగన్ కానీ, ఆ పార్టీ నాయకులు కాని, ఎప్పటికీ మరిచిపోలేరు.
ఆ కృతజ్ఞతతోనే జగన్ సైతం తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ అనుకూలంగా వ్యవహరిస్తూ, ఆంధ్ర, తెలంగాణ విభజనకు సంబంధించిన అనేక సమస్యలను వీరు కూర్చుని, చర్చించుకుని ఒక పరిష్కారాన్ని వెతుక్కున్నారు.
కేసీఆర్, జగన్ రాజకీయ ప్రత్యర్థులు సైతం వీరి స్నేహాన్ని చూసి అసూయ పడేలా, వీరు ఒకరికొకరు సహకరించుకుంటూ, స్నేహమంటే ఇదేరా అన్నట్లుగా వ్యవహరించే వారు.
కానీ అంతటి మిత్రుల మధ్య ఇప్పుడు కృష్ణా జలాల వివాదం చిచ్చు పెట్టింది.మొదట్లో ఈ వివాదాన్ని తేలిగ్గా తీసుకుని పరిష్కరించుకుందాం అనుకున్నా, రాజకీయ ప్రయోజనాలు దీనికి ముడిపడి ఉండటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఇద్దరు మిత్రుల మధ్య వివాదం ఏర్పడింది.
ఈ విషయం తెలంగాణలో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేలా, అక్కడి రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీలు మరింతగా రెచ్చగొట్టడం వంటి వ్యవహారాలతో టిఆర్ఎస్ ప్రభుత్వం సైతం ఏపీ ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టింది.
ఈ వ్యవహారం మరింత గా ముదరడంతో కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.తాజాగా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయని, మళ్ళీ వీరి స్నేహం చిగురిస్తుంది అని అంతా అనుకుంటుండగానే, జగన్ కేసీఆర్ మధ్య మరింతగా చిచ్చు పెట్టేలా అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది.ఇక ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వానికి కేసీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
పోతిరెడ్డిపాడుతో పాటు మిగతా ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకపోతే అలంపూర్ పెద్ద మరూర్ దగ్గర ప్రాజెక్టు ను నిర్మించి తీరుతాం అంటూ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం తప్పదని క్లారిటీ ఇచ్చేశారు.
అంటే కేసీఆర్ నదీజలాల విషయంలో ఏపీ ప్రభుత్వానికి దీటుగా తాము వ్యవహరిస్తామని, ఎక్కడా వెనక్కి తగ్గేది లేదనే సంకేతాలు ఇచ్చారు.రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎటువంటి జలవివాదాలు కానీ, సరిహద్దు వివాదాలు కానీ చోటు చేసుకోలేదు కానీ, ఇప్పుడు మాత్రం ఉప్పూ, నిప్పులా పరిస్థితి మారడానికి కారణం జగన్ బీజేపీతో స్నేహం చేయడమే కారణంగా కనిపిస్తోంది.
తాను బద్ద శత్రువుగా చూస్తున్న బీజేపీతో జగన్ అంట కాగడం కేసీఆర్ కు ఏమాత్రం నచ్చడం లేదు.
మొదటి నుంచి తాను జగన్ కు అండ దండగా ఉంటూ వస్తుంటే, ఇప్పుడు జగన్ బీజేపీ ట్రాప్ లో పడి తనతో వివాదం పెట్టుకునేందుకు సిద్ధంగా ఉండడం వంటివి ఆగ్రహం కలిగిస్తున్నాయి.
ఇప్పట్లో వీరి స్నేహం మళ్ళీ చిగురించే అవకాశం అయితే కనిపించడం లేదు.ఈ ఇద్దరి స్నేహితుల మధ్య మోదీతో పాటు కృష్ణ జలాలు సైతం చిచ్చు పెట్టినట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.