పెళ్లి చేసుకోవడం కోసం వధువు కావాలంటూ ఓ కుర్రాడు ఊరంతా పోస్టర్లు అంటించాడు.ఈ పోస్టర్లు చూసిన గ్రామస్తులంతా అవాక్కయ్యారు.
తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే తన ఇంటికి వచ్చి మాట్లాడాలని రాసుకున్నాడు.అది కూడా తెల్లవారుజామున 3:00 నుంచి ఉదయం 6 గంటల మధ్యలో మాత్రమే తన ఇంటికి రావాలని, తన గురించి ఇతరులకు అడగకుండా నేరుగా తననే కలవాలని ఆ వాల్ పోస్టర్లో రాసుకున్నాడు.అసలు ఆ యువకుడు ఎవరు.? ఎందుకు అలా వాల్ పోస్టర్ రాశాడో అనే వివరాలు చూద్దాం.
వివరాల్లోకెళితే.బాపట్ల జిల్లా( Bapatla district ) వేటపాలెం లోని రామన్నపేటకు చెందిన అయ్యప్ప కుమార్ (28)కు తన చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో అమ్మమ్మ దగ్గర పెరిగాడు.కరోనాకు ముందు హైదరాబాదులో ఓ చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు.కరోనా వచ్చినప్పటినుండి ఉద్యోగం మానేసి అమ్మమ్మ వద్ద ఉంటూ తనకు పెళ్లి చేయాలని అమ్మమ్మను వేధించేవాడు.
అయితే అతని అమ్మమ్మ ఏదైనా ఉద్యోగం చూసుకో అప్పుడే ఎవరైనా పిల్లను ఇస్తారు అని పలుమార్లు మందలించింది.
దీంతో తన పెళ్లి తానే సెట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.వెంటనే వాల్ పోస్టర్ తయారు చేశాడు.అందులో నేనంటే ఇష్టం ఉన్న అమ్మాయిలు ఎవరైనా ఎటువంటి ఫోన్లు, మెసేజ్లు చేయాల్సిన అవసరం లేకుండా రామన్నపేటలోని మా ఇంటికి వచ్చి ధైర్యంగా నన్ను కలవగలరు.
మా ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడకుండా నేరుగా నాతో మాట్లాడండి.నా పేరు దేవన నీలకంఠం అయ్యప్ప కుమార్, నా వయసు 28 సంవత్సరాలు, చదువు : డిగ్రీ బీకాం అని రాసుకున్నాడు.ఈ పాంప్లెట్లను వేటపాలెంలోని అన్ని ప్రధాన సెంటర్లలో అంటించాడు.దీంతో ఈ వాల్ పోస్టర్ చూసిన గ్రామస్తులంతా అవాక్కయ్యారు.
ఈ విషయం పోలీసులకు ( Police )తెలియడంతో అయ్యప్ప ఇంటికి వచ్చి అతని అమ్మమ్మ నువ్వు విచారించారు.అయ్యప్ప ( Ayyappa )కు ఉద్యోగం లేని కారణంగా మానసిక స్థితి నిలకడగా లేదని తెలిపింది.
ప్రస్తుతం పరారీలో ఉన్న అయ్యప్ప కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.