ఎన్నో ట్విస్ట్ ల మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు ఎమ్మెల్సీ పదవి దక్కింది.అయితే ఆమెకు ఎమ్మెల్సీ కాకుండా , రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని అంతా భావించారు.
కెసిఆర్ కూడా కవితను రాజ్యసభకు పంపించాలని భావించారు.ఈ మేరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించారు.
ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యురాలిగా కవిత ను ఎంపిక చేయాలని కెసిఆర్ భావించినా కవిత మాత్రం తెలంగాణ రాజకీయాల్లోనే యాక్టివ్ గా ఉండాలని భావించడం తో రాజ్యసభకు వెళ్లేందుకు నిరాకరించింది.ఈ పదవి మూడు ఏళ్లు మాత్రమే ఉండడం తదితర కారణాలతో తనకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాల్సిందిగా తన తండ్రి కెసిఆర్ పై ఒత్తిడి తీసుకురావడంతో ఆమెకు రాజ్యసభ సభ్యత్వం కాకుండా, ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది.
అయితే ఎమ్మెల్సీ పదవి దక్కడం తో కవిత రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.ఆమె స్థానంలో మరొకరికి అవకాశం దక్కబోతొంది.
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఎంపీగా నిజామాబాద్ నుంచి పోటీచేసి బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి చెందారు. రాబోయే ఎన్నికల్లోనూ అక్కడి నుంచి పోటీ చేయాలని ముందుగా భావించినా, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిస్థితులు అంత ఆశాజనకంగా లేకపోవడం, అక్కడ బిజెపి బలంగా ఉండడంతో పాటు, ధర్మపురి శ్రీనివాస్ పార్టీకి దూరంగా ఉండడం, అక్కడ పార్టీ బలహీనంగా ఉండటం తదితర కారణాలతో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి తప్పదు అనే అభిప్రాయంతో కవిత ఎమ్మెల్సీ గా సేఫ్ జోన్ లోకి వెల్లినట్టుగా కనిపిస్తున్నారు.
అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఆమెకు ఏ స్థాయిలో ప్రాధాన్యం దక్కబోతోంది అనేది అందరికీ ఉత్కంఠ కలిగిస్తోంది.
మంత్రివర్గ విస్తరణ కెసిఆర్ చేపట్టనున్న నేపథ్యంలో మంత్రి గా అవకాశం కల్పిస్తారా లేక ఎమ్మెల్సీ గానే కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది.గత కొంతకాలంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు మధ్య చిన్నపాటి ఆధిపత్య పోరు నడుస్తోందని, అందుకే ఎడ మొఖం పెడ మొఖం అన్నట్టుగా ఉంటున్నారని, ఈ తలనొప్పులు భరించలేకనే కేసీఆర్ కవిత ను రాజ్యసభకు పంపించాలని చూసినా, ఆ తర్వాత మాత్రం ఎమ్మెల్సీ పదవిని పట్టుబట్టి మరి సంపాదించుకున్నారనే టాక్ టిఆర్ఎస్ లో వినిపిస్తోంది.