ప్రజాప్రతినిధుల ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ దొంగతనం జరగడం అంటే మామూలు విషయం కాదు.ఎందుకంటే వారి ఇల్లు, కార్యాలయ చుట్టూ సెక్యూరిటీ ఉండడంతో పాటు పోలీసుల పహారా, సీసీ టీవీ కెమెరాలు ఇలా చాలానే ఉంటాయి.
అయినా వారికి సంబందించిన ప్రదేశాల్లో దొంగతనం చేయడం అంటే నిజంగా సాహసం అనే చెప్పాలి.ఇప్పుడు అటువంటి సాహసమే చేసి మంగళగిరి ఎమ్యెల్యే, సీఆర్డీయే ఛైర్మెన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి షాక్ ఇచ్చారు కొంతమంది దొంగలు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయం లో మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం దాచి ఉంచిన 10 లక్షల రూపాయలు చోరీకి గురైంది.ఈ సంఘటన సంచలంగా మారింది.
సాక్షాత్తు ఎమ్యెల్యే కార్యాలయంలో దొంగతనం జరగడం ఏంటి అంతా షాక్ అయిపోయారు.ప్రస్తుతం ఈ దొంగతనంపై వైసిపి నేత జూపూడి జాన్సన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీనిపై మంగళగిరి అర్బన్ పోలీస్ స్టేషన్ లో చోరీ పై కేసు నమోదైంది.
కార్యాలయంలో పనిచేసే వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఎమ్మెల్యే కార్యాలయంలోకి బయట వ్యక్తులు వచ్చి చోరీకి పాల్పడే అవకాశం లేదని, ఆపీసు సిబ్బంది కానీ ఎమ్యెల్యే అనుచరుల పని కానీ ఇందులో ఉండి ఉండే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు.త్వరలోనే ఈ చోరీ కేసుని ఛేదిస్తామని వారు చెబుతున్నారు.