చైనాలోని వూహాన్ నగరంలో కనుగొనబడిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది.రోజుకూ లక్షల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజలు తమ ప్రాణాలు అరిచేతులో పెట్టుకుని జీవిస్తున్నారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగించిన ఈ కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు పలు దేశాలు పూర్తి లాక్డౌన్ను విధించాయి.
అయితే కొన్ని దేశాల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి.
ఇందులో చైనా కూడా ఒకటి.అక్కడి ప్రజలు సామాజిక దూరం పాటించడంతో పాటు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటుండటంతో అక్కడ కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.
కాగా అక్కడ అన్ని రంగాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి.ఇందులో భాగంగా చైనాలోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు తెరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.
కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తొలుత సినిమా థియేటర్లు తెరవనున్నారు.
జూలై 20న కొన్ని ప్రాంతాల్లో సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు రెడీ అయ్యాయి.
ప్రేక్షకులు ఖచ్చితంగా మాస్కులు వేసుకుని రావాలని, థియేటర్లో ఎలాంటి తినుబండారాలకు అనుమతి లేదని, అలాగే థియేటర్లో కేవలం 30 శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉండనుందని అక్కడి ప్రభుత్వం తెలిపింది.మొత్తానికి దాదాపు మూడు నెలలపాటు మూతబడ్డ థియేటర్లు తెరుచుకోనుండటంతో ప్రేక్షకలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో చూడాలి.